పనిమంతునికే పట్టం కట్టాలి

by Disha Web Desk 15 |
పనిమంతునికే పట్టం కట్టాలి
X

దిశ, పటాన్ చెరు : పనిమంతునికే పట్టం కట్టాలి అని, కలెక్టర్ గా, జాయింట్ కలెక్టర్ గా పనిచేసి విశేష అనుభవం కలిగిన బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామరెడ్డి విజయానికి సహకరించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామరెడ్డితో కలిసి పటాన్ చెరు డివిజన్ లో పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ మాదిరి జైపాల్, మాజీ కార్పొరేటర్లు సపాన్ దేవ్, శంకర్ యాదవ్, ప్రతాప్ సేటు తదితరులను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలనా రంగంలో ఎంతో అనుభవం ఉన్న వెంకట్రామరెడ్డి ఎంపీగా గెలిస్తే అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయన్నారు. ఎంపీ గానే కాకుండా సొంతంగా 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి యువతీ, యువకులకు కోచింగ్ కేంద్రాలు, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి

వారికి జాబ్ మేళా ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముందుకు రావడం అభినందనీయమన్నారు. అలాగే నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి శుభకార్యాలకు అందించనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, 6 గ్యారంటీలు ఆటకెక్కాయన్నారు. బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. మాయ మాటలు చెప్పేవారిని నమ్మవద్దని, పనిమంతుడైన వెంకట్రామరెడ్డికి మద్దతు తెలపాలన్నారు. మన లోకల్ నివాసి, తెల్లాపూర్ కు చెందిన వెంకట్రామరెడ్డికి ఎన్నికల్లో

భారీ మెజారిటీ అందించాలని కోరారు. మాయ మాటలు రావని, మాట తప్పే వాణ్ణి కాదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తెలిపారు. పఠాన్ చెరు ప్రాంతంలో ఉన్న సమస్యలపై, వాటి పరిష్కారంపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. ఈ ప్రాంత సమస్య లపై పార్లమెంటులో గళమెత్తుతానన్నారు. ఈ ప్రాంత వాసిగా, ప్రజా సేవ కోసం వస్తున్న తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story