అంగన్వాడి కేంద్రాల్లో కుళ్ళిన గుడ్లు..

by Sumithra |
అంగన్వాడి కేంద్రాల్లో కుళ్ళిన గుడ్లు..
X

దిశ, మిడ్జిల్ : అంగన్వాడి కేంద్రాల్లో దారుణం చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు సప్లై చేసిన గుడ్లలో పురుగులు ఉన్నాయన్న అనుమానంతో గుడ్లను పగలగొట్టి చూడగా పురుగులు బయటపడ్డాయి. దీంతో అక్కడ ఉన్నా బాలింతలు, గర్భణీలు నివ్వెరపోయారు. ఇలాంటి గుడ్లు తింటే ఆరోగ్యంగా ఉండడం కాదుకదా.. ఉన్న ప్రాణం కాస్త ఊడిపోతుందని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఈ ఘటన మిడ్జిల్ మండలంలోని 15 అంగన్వాడి కేంద్రాల్లో శుక్రవారం వెలుగు చూడడంతో బాలింతలు, మండల ప్రజలు నివ్వెరపోయారు. ఏకంగా 15 అంగన్వాడి కేంద్రాలకు కుళ్లిన నాసిరకం గుడ్లను సరఫరా చేయడంతోనే అంగన్వాడీ కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ ఏ పాటుగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మండలంలో తరచుగా ఇదే తంతు జరుగుతున్నా కాంట్రాక్టర్ పై జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోవడం పై పలువిమర్శలు వస్తున్నాయి.

కాంట్రాక్టర్ ఇచ్చే మామూళ్లకు ఆశపడే జిల్లా అధికారులు ఈ విషయం పై స్పందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు, బాలింతలకు చిన్నారులకు నాసిరకమైన చిన్న సైజు గుడ్లు పంపిణీ చేశారన్నారని, అంగన్వాడి ద్వారా తీసుకెళ్లిన గుడ్లను పగలగొట్టి చూడగా అందులో నుండి నల్లటి ద్రవం బయటపడడంతో పాటు పురుగులు తెలియాడుతూ కనబడ్డాయని పలువురు గర్భిణీ స్త్రీలు, బాలింతలు తెలిపారు. విడివిడిగా ఉండాల్సిన తెల్ల సన, పచ్చ సన కలిసి ఉండడంతో పాటు దుర్వాసన వెదజల్లుతుందని ఆయా గ్రామస్తులు తెలిపారు. ఈ విషయం పై సంబంధిత అంగన్వాడి నిర్వాహకులకు నిలదీయడంతో గత మే నెల 22వ తేదీన కాంట్రాక్టర్ తమకు గుడ్లను సప్లై చేశాడని, కాంట్రాక్టర్ను అడగండి మా ఒక్క సెంటర్ లోనే కాదు మిగతా సెంటర్లో కూడా ఇలానే వస్తున్నాయి అంటున్నారు. అన్ని మండలాల్లో ఇలాంటి గుడ్లనే పంపిస్తున్నారని, వారు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని, ఇలాంటి కుళ్ళిన గుడ్లు తింటే బాలింతలు, గర్భవతులు, చిన్నారుల పరిస్థితి ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తోందన్నారు. గుడ్లు పాలతో పాటు పోషకాలు ఉన్న ఆహారాన్ని ఇస్తుంది. గుడ్డు నుంచి పోషకాలు బాగా అందాలంటే దాని బరువు 44 గ్రాములు నుంచి 50 గ్రాముల బరువు ఉండాలని సూచిస్తుంది. ఒక ట్రేలో ఉన్న గుడ్లు బరువు దాదాపు కిలోన్నర ఉండాలి, కానీ కాంట్రాక్టర్ 30 గ్రాముల కన్నా తక్కువ బరువు ఉన్న కుళ్ళిన గుడ్లను కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి గుడ్డు పై ప్రభుత్వ లోగో ముద్రతో సరఫరా చేసేలా ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు మాత్రం తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.

కాంట్రాక్టర్ తో అధికారుల కుమ్మకు..?

సంబంధిత జిల్లా అధికారులు గుడ్ల కాంట్రాక్టర్ ఇచ్చే ముడుపుల కోసం అతను కుళ్ళిన తక్కువ పరిమాణం ఉన్న గుడ్లు సరఫరా చేసిన పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. గుడ్లు నాసిరకంగా ఉన్నాయని సరఫరా చేసే వారిని అడిగితే తమకు సంబంధం లేదని ఇచ్చిన గుడ్లు తీసుకోవాలని కసురుకుంటున్నారని తెలిపారు. దీంతో అంగన్వాడి టీచర్లు ఏమీ అనలేక గుడ్లు తీసుకుంటున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నా సదరు కాంట్రాక్టర్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన గుడ్లు అందేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

కాంట్రాక్టర్ నిర్వాకం వల్లే ఇలాంటి ఘటనలు సీడీపీఓ

ఈ విషయం పై అంగన్వాడి సీడీపీఓ మోహరినిస్స వివరణ కోరగా అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు 44 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు ఉండాలని, అలా ఉన్నప్పుడే గుడ్లలో పోషకాలు అధికంగా ఉండి గుడ్లు చెడిపోకుండా ఉంటాయని అన్నారు. కానీ గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ అంగన్వాడి కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా చేయడంతో పాటు తక్కువ పరిమాణం ఉన్న గుడ్లను పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ విషయం పై అనేక మార్లు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా మార్పు లేదన్నారు. ఈ ఘటనను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టర్ పై చర్యలకు సిఫారసు చేస్తామని, కుల్లిన గుడ్లను ఎవరు కూడా బాలింతలకు, గర్భవతులకు పంపిణీ చేయరాదని అన్నారు. అంగన్వాడి కేంద్రాలకు సప్లై చేసిన గుడ్ల పై అనుమానం ఉంటే తమకు సమాచారం అందించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లోని టీచర్లు గుడ్లపట్ల అప్రమత్తంగా ఉండాలని అంగన్వాడి సీడీపీఓ మొహురున్నిస్సా అన్నారు.

Advertisement

Next Story