పాలమూరు డీసీసీబీ హస్తగతం.. చైర్మన్ ఏకగ్రీవం..!

by Nagam Mallesh |
పాలమూరు డీసీసీబీ హస్తగతం.. చైర్మన్ ఏకగ్రీవం..!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీబీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. డీసీసీబీ చైర్మన్ గా పాన్ గల్ సింగిల్ విండో చైర్మన్ మావిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నాలుగున్నరేళ్ల క్రితం జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ ఏకంగా 13 స్థానాలను గెలుచుకొని డిసిసిబి చైర్మన్ పదవిని దక్కించుకుంది. చైర్మన్ గా ఉన్న నిజాం పాషా అనారోగ్యానికి గురి కావడంతో.. ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దాంతో చైర్మన్ ఎంపిక అనివార్యం అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిఆర్ఎస్ నుండి గెలుపొందిన మెజారిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రక్రియ ఆరంభం అయ్యింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో.. సంబంధిత ఎన్నికల అధికారులు ఎన్నిక ఏకగ్రీవం అయినట్లుగా ప్రకటించారు. మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా ఇద్దరు డైరెక్టర్లు మినహాయించి 11 మంది డైరెక్టర్లు ఎన్నికలకు హాజరయ్యారు. చైర్మన్ గా ఎంపికైన విష్ణువర్ధన్ రెడ్డిని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాసరెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, శ్రీహరి, మెగా రెడ్డి, అనిరుద్ రెడ్డి, పరిణికా రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేద్ ఉల్లా కొత్వాల్, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు అభినందించారు.

రైతులకు అండగా ఉంటా..

-డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి

తనపై నమ్మకం ఉంచి చైర్మన్ పదవి దక్కడానికి కారణం అయిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, డిసిసిబి డైరెక్టర్లు, పార్టీ శ్రేణులకు నూతన విష్ణువర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని రైతులకు అన్ని విధాల మేలు జరిగేలా చర్యలు తీసుకుంటానని మీడియా సమావేశంలో వెల్లడించారు.

Next Story

Most Viewed