MLA : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

by Kalyani |
MLA :  మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
X

దిశ, గద్వాల టౌన్ : తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే‌ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం గద్వాల పట్టణంలోని సంగాల చెరువు వద్ద మత్స్య కారులకు ఉచితంగా చేపలు‌ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ కలిసి వారి చేతుల మీదుగా సంగాల చెరువు రిజర్వాయర్ లో 80వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం వంద శాతం రాయితీపై మత్స్యకారులకు చేప పిల్లలను సరఫరా చేసిందన్నారు. రాష్ట్రంలో కుల వృత్తులను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో నదులు, సముద్రాల శాతం తక్కువని అయినా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకుని చేపల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.

అన్ని చెరువులను అభివృద్ధి చేసి చేపపిల్లలను పెంచేందుకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. మత్స్యకారులు కూడా ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గద్వాల మత్స్యకారుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, కౌన్సిలర్స్ మురళి, నరహరి శ్రీనివాసులు, పూడూరు కృష్ణ, కొండపల్లి సత్యన్న, గోవిందు, నాయకులు కార్యకర్తలు మత్స్యకారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story