వంటలు ఇలాగే వండుతారా..గుడ్డు, పెరుగు, విద్యార్థులకు ఇవ్వరా..?

by Kalyani |
వంటలు ఇలాగే వండుతారా..గుడ్డు, పెరుగు, విద్యార్థులకు ఇవ్వరా..?
X

దిశ, అలంపూర్: నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కస్తూర్బా పాఠశాలలను ఏర్పాటు చేస్తే... వంటలు చేయడంలో నిర్లక్ష్యం చేయడం... మెనూ ప్రకారం పెరుగు, గుడ్లు ఇవ్వకపోవడం ఏమిటని కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయురాలను జడ్పీ సీఈఓ లక్ష్మీకాంతమ్మ ప్రశ్నించారు. గురువారం మధ్యాహ్నం సమయంలో జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థులకు బోధన ఏ విధంగా జరుగుతుందో పరిశీలించారు. పాఠశాలలో ప్రతి క్లాస్ రూమ్ విజిట్ చేసి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు.

భోజనం ఇలాగే వండుతారా... గుడ్డు, పెరుగు, విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం లేదని అక్కడున్న ఉపాధ్యాయురాలను ఆమె ప్రశ్నించారు. రుచికరంగా లేని భోజనం పెడితే విద్యార్థులు ఎలా తింటారని, మన ఇండ్లలో కూడా ఇదేవిధంగా చేసుకుంటామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు చేస్తున్న వంటలో మార్పు రావాలని, నాణ్యమైన చదువు చెప్పాలని హెచ్చరించారు. ప్రతి విద్యార్థికీ యూనిఫామ్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. మరోసారి విజిట్ చేసినప్పుడు ఇవన్నీ సరిగ్గా ఉండాలని.. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు సరిపడా గదులు లేవని, తాగునీటికి ఇబ్బందిగా ఉందని జడ్పీ సీఈఓకు విన్నవించుకున్నారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.....

విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో మార్పులు తప్పనిసరిగా చేయిస్తామని, ముందుగా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. గదుల కొరత విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామన్నారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూలో మార్పు జరగకపోతే అది ఎవరైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు ఆమె తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులు కస్తూర్బా పాఠశాలలపై నమ్మకంతో అడ్మిషన్లు చేయించి తమ పిల్లలను వదులుతుంటారు. అలాంటి నమ్మకాన్ని నిజం చేస్తూ విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్య అందించినప్పుడే నమ్మకం పెరుగుతుందన్నారు. గద్వాల జిల్లాలో ఎక్కడైనా.. ఏ పాఠశాలలోనైనా విద్యార్థుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed