ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి రూ. 25 లక్షలు మంజూరు

by Sridhar Babu |
ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి  రూ. 25 లక్షలు మంజూరు
X

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ ఆసుపత్రి అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేయించనున్నట్లు ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు. బుధ‌వారం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా దవాఖానలో సూప‌రింటెండెంట్, డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి నుంచి వివరణ తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ స్వ‌రాజ్య‌ల‌క్ష్మిని మంత్రి ఆదేశించారు. రోగుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు ప్ర‌భుత్వం సౌక‌ర్యాలు క‌ల్పిస్తుంటే వైద్యులు, సిబ్బంది విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌కుండా నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం స‌మంజ‌స‌మేనా అని ప్ర‌శ్నించారు.

స‌మ‌య‌పాల‌న పాటించ‌క‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆయన హెచ్చ‌రించారు. ఈ సందర్భంగా పలువురు రోగులకు అందుతున్న వైద్య సేవలను వారితో మాట్లాడి ఆరా తీశారు. డాక్ట‌ర్లు, న‌ర్సులు స‌రైన స‌మ‌యానికి రావ‌టం లేద‌ని, త‌మ ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మంత్రికి వివ‌రించారు. వైద్యులు, సిబ్బంది సమ‌యపాల‌న పాటిస్తూ రోగుల‌కు అందుబాటులో ఉండి సేవ‌లు అందించాల‌ని మంత్రి సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందజేసే బాధ్యత మనపై ఉందని అన్నారు. అనంతరం దవాఖానలోని పలు విభాగాలను ఆయన పరిశీలించారు. వివిధ విభాగాలను తేలిగ్గా గుర్తించేలా సైన్‌బోర్డులు పెట్టాలని సూచించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాల‌న్నారు. త్వరలో ఆసుపత్రి అభివృద్ధిపై కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed