భద్రాద్రి రామాలయం అభివృద్ధికి వడివడిగా అడుగులు..

by Naresh |
భద్రాద్రి రామాలయం అభివృద్ధికి వడివడిగా అడుగులు..
X

దిశ, భద్రాచలం: భద్రాచలం రామాలయ అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ దిశగానే వడివడిగా అడుగులు వేస్తుంది. భూసేకరణ, పునరావాసం కొరకు 246 జి.ఓ ద్వారా రూ. 60.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, శనివారం తాజాగా రామాలయం అభివృద్ధికి అవసరం అయ్యే భూసేకరణ చేయడానికి అనుమతి ఇస్తూ జి.ఓ ఆర్ టి నెంబర్ 349 విడుదల చేసింది. ప్రాథమిక సర్వేలో మొత్తం 43 ఇండ్లు తొలగించాల్సి ఉంటుందని అధికారులు అంచనాకి వచ్చారు. రామాలయం చుట్టూ ఉన్న ఒక ఎకరం అరగుంట స్థలం సేకరణ చేపట్టనున్నారు. 23.5 గుంటల స్థలంలో ఇండ్లు ఉండగా, 17 గుంటల ఖాళీ స్థలం ఉన్నట్లు ప్రాథమిక సర్వేలో తేలింది.

కాగా.. ప్రభుత్వం నుండి అనుమతి రావడంతో తుది సర్వే నిర్వహించి 'ద రైట్ టు ఫైర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజేషన్ రిహాబిలిటేషన్ రీ సెటిల్మెంట్ యాక్ట్ 2013' ద్వారా భూసేకరణ చేపట్టనున్నారు. వచ్చే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టడానికి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా అడుగులు వేస్తుంది.

గత పుష్కరాలకు భద్రాచలం పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి 60 లక్షల మంది భక్తులు వచ్చారు. వచ్చే పుష్కరాలకు కోటి మందికి పైగా భక్తులు భద్రాద్రి వచ్చే అవకాశం ఉండటంతో, ఆ మేరకు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

Advertisement

Next Story