పర్మిషన్లు నిల్.. ఫీజులు మాత్రం ఫుల్..!

by Nagam Mallesh |
పర్మిషన్లు నిల్.. ఫీజులు మాత్రం ఫుల్..!
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : ఇప్పుడు విద్య అనేది వ్యాపారంగా మారిపోయింది. ఓ బిల్డింగ్ ఉంటే చాలు.. అధికారులను మేనేజ్ చేసేసి ఎలాంటి పర్మిషన్లు లేకున్నా ఎవరు పడితే వాళ్లు స్కూళ్లు, కాలేజీలు పెట్టేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నా పేద మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చేర్చుతున్నారు. ఇదే అదునుగా తీసుకున్న ఒక వ్యాపారి చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీలో అనుమతులు లేకుండా నిర్మించిన భారీ భవంతిని అద్దెకు తీసుకొని పాఠశాలకు సైతం అనుమతి లేకుండానే చైతన్య స్కూల్ పేరుతో తరగతులు నిర్వహిస్తున్నారు. పరిసర ప్రాంతాల గిరిజన తండాలను టార్గెట్గా చేసుకుంటూ అరకొర అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తూ కోట్లు గడిస్తున్నారు. పాఠశాలకు పూర్తి అనుమతులు పొందకుండానే పాఠశాలను నిర్వహిస్తున్నారు.

బడి కొత్తదే.. ఫీజులు మాత్రం వేలల్లో..

చుంచుపల్లి మండలం నంద తండాలో నిర్మాణం పూర్తి అయిన భవంతిలో చైతన్య స్కూల్ పేరుతో జూన్ లో కొత్తగా ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తామంటూ అరచేతిలో నక్షత్రాలు చూపించి అడ్మిషన్లు భారీగానే చేశారు. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని భావించిన తల్లిదండ్రులకు ఫీజుల రూపంలో చుక్కలు చూపెడుతున్నారు. నిన్న గాక మొన్న పురుడు పోసుకున్న పాఠశాలలో అడ్మిషన్ ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్, ప్రాజెక్టులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు నుంచి వేలకు వేలు లాగేస్తున్నారు. పాఠశాలలో ఉంచవలసిన ఫీజుల పట్టిక ఉంచకుండా తల్లిదండ్రులను కన్ఫ్యూజ్ చేస్తూ వేల రూపాయలు దండుకుంటున్నారు.

పాఠశాలకు బోర్డు లేదు, క్రీడా మైదానం అసలు కనిపించట్లేదు. ఎలాగో అనుమతి రాలేదు బోర్డు పెట్టడం ఎందుకు అనుకున్నారో ఏమో అంతా హడావుడి చేసి అన్ని అడ్మిషన్లు పొందిన పాఠశాలకు కనీసం బోర్డు లేకపోవడం ఆశ్చర్యాన్ని తొలగించే అంశం. ఒక పాఠశాల నిర్వహించాలంటే చదువుతోపాటు పిల్లల ఆటపాటలకు స్కూల్ ప్రాంగణంలో క్రీడా మైదానం ఉండటం తప్పనిసరి కానీ ఇందులో చదివే పిల్లలకు ఆటపాటలు దూరమైనట్లేనని అర్థమవుతుంది. స్కూల్ ప్రాంగణం మొత్తం కేవలం భవంతి మాత్రమే ఉండడంతో విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం ఆడే ఆటలుకు పూర్తిగా దూరమవుతున్నారు.

అధికారుల అనుమతితోనే పాఠశాలలను నిర్వహిస్తున్నాం అంటూ బుకాయిస్తుస్తోంది స్కూల్ యాజమాన్యం. మాకు పూర్తి అనుమతులు రాకపోయినా అధికారులు పాఠశాలను నిర్వహించుకోవచ్చు అని అనుమతిని ఇచ్చారు. జిల్లా విద్యాధికారికి ఎంఈఓ కి చెప్పి పాఠశాల నిర్వహిస్తున్నాం. పాఠశాల నిర్వహించేందుకు అనుమతులు చేతికి రావాల్సిన అవసరం లేదు, అప్లై చేస్తే సరిపోతుంది అంటూ పాఠశాల ప్రిన్సిపాల్ ఇచ్చిన వివరణ అనేక అనుమానాలకు తావిస్తోంది. అధికారులకు ముడుపులు ముట్టజెప్పకుండానే ఇంత బహిరంగంగా అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహించడం సాధ్యమవుతుందా అంటూ విద్యార్థులకు తల్లిదండ్రులు గుసగుసలాడుకోవడం గమనార్ధం.

Next Story

Most Viewed