వివాదాల్లో ‘పోలీస్’.. మచ్చ తెస్తున్న కొందరి వ్యవహారశైలి

by Mahesh |
వివాదాల్లో ‘పోలీస్’.. మచ్చ తెస్తున్న కొందరి వ్యవహారశైలి
X

దిశ, ఖమ్మం బ్యూరో: ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు అనవసర వివాదాల్లో తలదూర్చి కాంప్లికేట్ అవుతున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తూ తమకు అనుకూలంగా ఉన్న వారికి అనుకూలమైన పనిచేసి పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో స్టేషన్ సిబ్బంది కొందరు అతిగా వ్యవహరిస్తూ కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తున్నారన్న టాక్ నడుస్తుంది. హోంగార్డు మొదలు కొందరు వివాదాలకు కేరాఫ్ గా ఉంటున్నారని టాక్. భూ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, సెటిల్ మెంట్లు చేయడం, భార్యాభర్తల కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడం తో పాటు.. లంచం తీసుకుంటూ ట్రాప్ కావడం, వివాహేతర సంబంధాలు మెయింటేన్ చేయడం పరిపాటిగా మారుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో రెండు జిల్లాలో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నా.. కొందరు పెడచెవిన పెడుతున్నారు. కాగా ఇలాంటి విషయాల్లో తలదూర్చే వారి విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దని, కఠిన చర్యలు తీసుకునే దిశగా ఆ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నారు.

8 కేసుల్లో మూడు ఆ శాఖవే..

ఈ మధ్యకాలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటున్న విషయంలో వేర్వేరు శాఖల్లో 8 కేసులు నమోదు చేయగా.. అందులో 3 కేసులు పోలీస్ శాఖవి కావడం విశేషం. ఇందులో భద్రాచలం, పాల్వంచలో ఒక్కొక్క కేసు నమోదు కాగా.. ఖమ్మం పరిధిలో మరో కేసు నమోదైంది. మిగతా ఐదు కేసులు రెవెన్యూ, విద్యుత్, కమర్షియల్ ట్యాక్స్, ఆర్టీఓ, టౌన్ ప్లానింగ్ శాఖల్లో నమోదైనవి. ఏమీ ఆశించకుండా పనులు చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు లంచం డిమాండ్ చేస్తుండటంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా గురువారం ఓ కేసు విషయంలో 20 వేలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా పాల్వంచ ఎస్ఐ రామును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

వివాదంగా మారుతున్న కొందరి వ్యవహారశైలి

ఖమ్మంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేసే రాంబాబు భార్యాభర్తల వ్యవహారంలో తలదూర్చి, చెల్లీ, బుజ్జీ అంటూ ఓ మహిళకు దగ్గరయ్యాడు. కొంతకాలానికి వివాహేతర సంబంధం నడుస్తుందని గమనించిన మహిళ భర్త ఇద్దరినీ రెండ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని వీడియోలు సైతం బయటకు రావడం, కానిస్టేబుల్ వ్యవహారం నిజమని తేలడంతో కమిషనర్ కఠిన చర్యలు తీసుకున్నారు.

= ఖమ్మం జిల్లాలోని ఓ మండలంలో పనిచేసే సబ్ ఇన్స్ పెక్టర్ ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. విషయం ఎస్ఐ భార్యకు, వివాహిత భర్తకు తెలియడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రహస్యంగా ఎంక్వైరీ చేశారు. నిర్థారణ అయ్యాక అక్కడి నుంచి బదిలీ చేసి కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారు.

= ఖమ్మం జిల్లాలోని ఓ స్టేషన్ లో ఎస్ ఐగా విధులు నిర్వహిస్తున్న మహిళపై ఆ శాఖకు చెందిన పై అధికారి వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం చినికిచినికి గాలివాన గా మారే ప్రమాదం ఉందని గ్రహించిన ఉన్నతాధికారి అతన్ని పిలిచి చివాట్లు పెట్టినట్లు తెలుస్తుంది. ప్రవర్తన మార్చుకోవాలని గట్టిగానే సూచించినట్లు సమాచారం.

= అనుమతులు లేకుండా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ వాహనాన్ని ఖమ్మం పరిధిలోని పోలీసులు పట్టుకుని స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేయకుండానే కాలయాపన చేస్తున్నారు. ఆ వాహనం ఫోటో తీసుకునేందుకు కూడా అనుమతించకుండా.. పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తామని దాటవేశారు.

ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే..

రెండు జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ వ్యవహారాలపై దృష్టి పెడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కొందరు కిందిస్థాయి అధికారులు ఉన్నతాధికారులనే బురిడీ కొట్టిస్తున్నారని, తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆ శాఖ సిబ్బందే చెబుతున్నారు. మరికొందరు అధికారుల వేధింపులు చెప్పలేక, తర్వాత టార్గెట్ కావడం ఇష్టం లేక విధులు నిర్వహిస్తున్నారు. ఖమ్మం కమిషనర్ సునీల్ దత్, కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ ఎప్పటికప్పుడు ఆ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కొందరు తమ వ్యవహారశైలిని మార్చుకోలేకపోతున్నారు. అనవసర వివాదాల్లో తలదూర్చి పోలీస్ శాఖ ప్రతిష్టను తీస్తున్నారు. అయితే రెండు జిల్లాల పోలీసు బాసులు ఇప్పటికే కాంప్లికేటెడ్ వారి వివరాలు తెప్పించుకున్నారని, వారి వ్యవహారశైలిపై నిఘా పెట్టినట్లు సమాచారం.



Next Story