'జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన'

by Vinod kumar |
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన
X

దిశ, ఖమ్మం టౌన్: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేకనే ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో తెలంగాణ రాకముందు హామీలు ఇచ్చారని.. గత పది సంవత్సరాలుగా హామీలు ఇస్తున్నారే కానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. పాత్రికేయ సంఘాలు చాలా కాలంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, అదేవిధంగా సీపీఎం పార్టీ కూడా అనేక సందర్భాల్లో ఈ సమస్యను ప్రస్తావించామని, జర్నలిస్టుల సమస్యల కోసం జిల్లావ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించామని, సీపీఎం పార్టీ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యపై ధర్నా చేసిన రోజే అనేక సంఘాలు సంఘీభావం తెలిపాయని అన్నారు.

ప్రభుత్వం నుండి కూడా హామీ ఇచ్చారని.. రెండు జర్నలిస్ట్ మహాసభల్లో పాల్గొన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా మంత్రి హామీ ఇచ్చారని, మూడు నెలల్లో సమస్య అయిపోతుందని అన్నారని తెలిపారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భ సభ జరిగిందని, సభలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చామని.. ఆ సభలో సీఎం మాట్లాడుతూ కోర్టులో ఆటంకాలు తొలిగిపోయాయని, జిల్లా కేంద్రంతో పాటు జిల్లా అంతట జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సభలోనే మంత్రులు హరీష్ రావు, అజయ్ కుమారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. పది నెలలు కావస్తున్నా ఇంకా కార్యచరణ దాల్చలేదని, మొదట 5 ఎకరాలు, తరువాత 23 ఎకరాలు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన ఆగిపోయాయని, అసలు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఇళ్ల స్థలాలు ఎప్పుడొస్తాయోనని ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయం దగ్గర పడిందని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఇండ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యం కాదని, ఎన్నికలు అయిపోయిన తర్వాత హామీలు ఇచ్చినవారు, వాగ్దానం చేసిన వారు ఉంటారనే గ్యారెంటీ లేదని, మళ్లీ సమస్య మొదటికి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈనెల 30వ తేదీ లోపు అధికారిక స్పందన రాకుంటే సీపీఎం పార్టీ చొరవు తీసుకొని అన్ని రాజకీయ పార్టీల వారిని, ప్రజా సంఘాలను, జర్నలిస్టు సంఘాలను సమావేశపరిచి ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై విక్రమ్, బండి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎర్రా శ్రీనివాసరావు, నండ్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story