రవాణా శాఖ కొరడా..ప్రత్యేక టీంలతో వాహన తనిఖీలు

by samatah |
రవాణా శాఖ కొరడా..ప్రత్యేక టీంలతో వాహన తనిఖీలు
X

దిశ, పెద్దపల్లి : రవాణా శాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్​తో ఉమ్మడి కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలలో ఖజానాకు కాసుల వర్షం కురిపించే పనిలో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రాష్ర్ట వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు కేవలం 13రోజుల్లో ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో రూ. కోటి 26 లక్షల ఆదాయం వచ్చిందంటే ప్రత్యేక డ్రైవ్​ ఎంత పక్కగా సాగుతుందో అర్థమవుతుంది. ప్రత్యేక డ్రైవ్​లో వివిధ రకాల ట్యాక్స్ చెల్లించకుండా రోడ్లపై తిరుగుతున్న 700 వాహనాలకు పైగా సీజ్​ చేశారు అధికారులు. పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలతో పాటు కరోనా కారణంగా ఇప్పటి వరకు వాహన రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని ఇలాంటి పరిస్థితుల్లో సర్కార్​ స్పెషల్​ డ్రైవ్​ పేరుతో టాక్సులు వసూలు చేయడం విమర్శలకు కారణం అవుతుంది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో ప్రభుత్వ ఆదేశాలతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గత నెల 15వ తేదీ నుంచి రాష్ర్టవ్యాప్తంగా స్పెషల్​ డ్రైవ్​లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్​, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో తనిఖీలు నిర్వహించడానికి ప్రతి జిల్లాకు నాలుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలలో ఇతర జిల్లాలకు చెందిన అధికారులను ఒక టీంగా తయారు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. సెలవు దినాలు తప్ప మిగిలిన రోజుల్లో ప్రతి రోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

13 రోజుల్లో రూ. 1.26 కోట్లు..

ఆర్టీఓ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రభుత్వానికి ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో రూ. 1.26 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీఓ అధికారులు చెబుతున్నారు. మార్చి 31వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్​ ద్వారా ఆదాయం గణనీయంగా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. సీజ్​ అయిన వాహనదారులకు ప్రస్తుతం బాకీ ఉన్న పన్నుతో పాటు 200శాతం అధిక పెనాల్టీ వేస్తారు.

బెంబేలెత్తుతున్న వాహదారులు..

పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలతో టాక్సీలు నడుపుకున్న వాహనదారులకు ఇప్పుడు పెద్దగా లాభాలు లేవని అంటున్నారు. కరోనా సమయంలో రెండు సార్లు లాక్​ డౌన్​తో పాటు శుభకార్యాలు, జాతరలు, పాఠశాల నిర్వహణపై ప్రభుత్వం విధించిన ఆంక్షలతో గడిచిన నాలుగు సంవత్సరాలు వాహన రంగం తీవ్ర నష్టాల్లో కురుకుపోయిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ కుటుంబం గడవడమే కష్టంగా ఉందని ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్సీలు చెల్లించడం కష్టంగా మారిందంటున్నారు. కరోనా సమయంలో కేవలం టాక్సీ నడిపించుకునే వాహనదారులకు మూడు నెలల టాక్సీని రెండుసార్లు మాత్రమే ప్రభుత్వం రద్దు చేసిందని కరోనా ప్రభావంతో పాటు ఇప్పటికీ వాహన రంగం కొలుకోవడం లేదని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము కుటుంబ పోషణకు ఇంటి నుంచి వాహనం తీయాలంటేనే భయంగా మారిందని అంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని సీజ్​ చేయకుండా విడతల వారీగా టాక్సీ కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Next Story

Most Viewed