Government vip : గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది

by Kalyani |
Government vip : గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది
X

దిశ, వేములవాడ : గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. దుబాయ్ లోని ఈ టి.సి.ఏ, గల్ఫ్ తెలంగాణ సంఘం, స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలతో పాటు అబుదాబిలో టాడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మికులతో పాటు దుబాయ్ లో ఉంటున్న వారి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మేలును, గల్ఫ్ బోర్డు వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ… దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చామని,

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి గల్ఫ్ కార్మికుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గల్ఫ్ లో మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నామని, గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేకంగా ప్రజా భవన్ లో ప్రవాసి దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. తెలంగాణ గురుకులలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు సీట్లలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గల్ఫ్ కార్మిక సమస్యలపై గత ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముందడుగు వేశామన్నారు. అరబ్ దేశాలలో సైతం బతుకమ్మ వేడుకలు జరపడం భావితరాలకు మనం అందించే మంచి సంస్కృతికి ఆదర్శమని అన్నారు. ఇదిలా ఉండగా అరబ్ దేశాల్లోనూ తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ, దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story