Caste Census : కులగణన నివేదికపై 18న మంత్రిమండలిలో చర్చ

by Hajipasha |
Caste Census : కులగణన నివేదికపై 18న మంత్రిమండలిలో చర్చ
X

దిశ, నేషనల్ బ్యూరో : కుల గణన నివేదికపై ఈ నెల 18న రాష్ట్ర మంత్రిమండలిలో చర్చిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయం ఆధారంగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణను సిద్ధం చేస్తుందన్నారు. సోమవారం రోజు బీసీ వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశమై కులగణన నివేదికపై అభిప్రాయాలను సేకరించారు.

అనంతరం విలేకరులతో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఈ సమావేశానికి బీసీ వర్గం ఎంపీలనూ పిలిచినప్పటికీ, వారిలో కనీసం ఒక్కరు కూడా రాలేదన్నారు. 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్ మీటింగ్‌కు హాజరయ్యారని చెప్పారు. కులగణన నివేదికను అమలు చేయాలని వారు తనకు వినతిపత్రాన్ని అందించారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ‘‘ఇది కేవలం బీసీలకు సంబంధించిన కులగణన నివేదిక కాదు. 7 కోట్ల కన్నడిగుల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులను అద్దంపట్టే విలువైన సమాచారం’’ అని ఆయన తెలిపారు. దేశంలోనే తొలిసారిగా కులగణనను కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన విషయాన్ని సిద్ధరామయ్య గుర్తు చేశారు.

Advertisement

Next Story