hunger strike : నేత కార్మికుల రిలే నిరాహార దీక్ష..

by Sumithra |
hunger strike : నేత కార్మికుల రిలే నిరాహార దీక్ష..
X

దిశ, గంగాధర : పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమలకు ప్రభుత్వం వస్త్రోత్పత్తి ఆర్డర్లు అందించి కార్మికులకు పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో పవర్ లూమ్స్ కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తర్వాత స్థానాన్ని ఆక్రమించిన గర్శకుర్తి పవర్ లూమ్స్ వస్త్రపరిశ్రమ గత ఎనిమిది నెలలుగా వస్త్రోత్పత్తులు నిలిచి పనులు లేక నేతన్నలు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కల్పించిన బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిచిపోయాయి.

దీంతో గ్రామంలో వస్త్రోత్పత్తులు నిలిచిపోగా, గ్రామంలో తయారు చేసే చీరలకు మార్కెట్ లో డిమాండ్ తగ్గింది. దీంతో పవర్ లూమ్స్ యజమానులు చేసేది లేక వస్త్ర ఉత్పత్తులు నిలిపివేశారు. సాంచలనే నమ్ముకుని జీవనోపాధి పొందే పవర్ లూమ్స్ కార్మికులు వీధిన పడి ఆందోళన చెందుతున్నారు. పొద్దంతా పని చేస్తేనే పూట గడిచే పవర్ లూమ్స్ కార్మిక కుటుంబాలు ఎనిమిది నెలలుగా పనులు లేక పస్తులుండే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. గర్షకుర్తిలోని వస్త్ర పరిశ్రమలకు ప్రభుత్వపరంగా గుడ్డ ఉత్పత్తులకు ఆర్డర్లు అందించి పనులు కల్పించాలంటూ నేతకార్మికులు డిమాండ్ చేశారు.

గత పదేళ్ల కింద గ్రామంలో చోటు చేసుకున్న నేతన్నల ఆత్మహత్యలు, ఆకలి చావులు మళ్లీ పునరావృతం కాకముందే గ్రామంలోని వస్త్ర పరిశ్రమలకు ప్రభుత్వం గుడ్డ ఉత్పత్తి కల్పించి ఆదుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. గ్రామ పవర్ లూమ్స్ కార్మిక సంఘం అధ్యక్షుడు గడ్డం నారాయణ ఆధ్వర్యంలో పవర్ లూమ్స్ కార్మికులు పెద్ద సంఖ్యలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం పవర్ లూమ్స్ కు వస్త్రోత్పత్తి ఆర్డర్లు కల్పించే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని కార్మిక సంఘం అధ్యక్షుడు గడ్డం నారాయణ వివరించారు.



Next Story