Collector Sandeep Kumar Jha : ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టుల పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి..

by Sumithra |
Collector Sandeep Kumar Jha : ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టుల పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సూచించారు. గురువారం జిల్లా ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇంటర్మీడియట్ విద్య పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాలో ఉన్న జూనియర్ కళాశాలలు, విద్యాశాఖ పరిధిలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు, విద్యార్థుల ఎన్రోల్మెంట్, కోర్సుల వివరాలు, హాజరు మొదలగు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 10 జూనియర్ కళాశాలలు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలతో పాటు మరో 31 విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ విద్య బోధించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

ఎంపిసి, బైపిసి,సిఈసి,హెచ్ఈసి వంటి రెగ్యులర్ కోర్సులు, మరో 5 ఒకేషనల్ కోర్సులు ఉన్నాయని, సుమారు 3 వేలకు పైగా విద్యార్థులు జిల్లాలో ఇంటర్ విద్య అభ్యసిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో త్రాగునీటి సరఫరా, కాంపౌండ్ వాల్, టాయిలెట్ల, విద్యుత్ ఫర్నిచర్, అందుబాటులో ఉన్న జూనియర్ లెక్చరర్స్, విద్యార్థుల హాజరు శాతం, మెరుగైన ఫలితాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను కలెక్టర్ విద్యాసంస్థల వారీగా రివ్యూ నిర్వహించి అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థుల అవసరాల మేరకు సురక్షిత త్రాగునీటి సరఫరా ఉండాలని, దీని కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. కళాశాల భవనాల స్థితిగతులు, టాయిలెట్స్, విద్యుత్ పరికరాలు, ఫ్యాన్లు, మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు.

కావాల్సిన అన్ని ఏర్పాట్ల పై సమగ్ర నివేదికను ఇవ్వాలని డీఐఈఓను కలెక్టర్ ఆదేశించారు. ఇంటర్ విద్యార్థుల ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రమాణాల పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్.. మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటర్ విద్యార్థులు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఎకనామిక్స్ లలో సామర్థ్యం పెంపొందించడం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అలాగే గణితం పట్ల అధిక శ్రద్ద చూపించాలని, పోటీ పరీక్షలో విద్యార్థులకు ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సాధించేలా బోధించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీఐఓ. మోహన్, కళాశాల ప్రిన్సిపాల్ లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story