Ramagundam : ఆ షాపింగ్ కాంప్లెక్స్ కు వీడని గ్రహణం..?

by Aamani |
Ramagundam : ఆ షాపింగ్ కాంప్లెక్స్ కు వీడని గ్రహణం..?
X

దిశ,గోదావరిఖని: పేరు గొప్ప... ఊరు దిబ్బ అనే సామెత రామగుండం నగరపాలక సంస్థకు సరిగ్గా సరిపోతుంది. పాలకులు మారిన.... అధికారులు మారిన... రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో మార్పు రావడం లేదు. అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేక పోయింది. ఇప్పుడు ఆ షాపింగ్ కాంప్లెక్స్ బూతు బంగులను తలపిస్తూ కేవలం మందుబాబులకు అడ్డాగా తయారైంది.నగర నడిబొడ్డున నిర్మించిన ఈ షాపింగ్ కాంప్లెక్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గత పది ఏళ్ల కిందట అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రెండు కోట్ల వ్యయంతో అధునాతన పద్ధతిలో సెల్లార్, జి ప్లస్ టు పద్ధతిలో మొత్తం 79 గదులతో ఈ వ్యాపార వాణిజ్య సముదాయం ను నిర్మించారు. పుష్కరకాలం దాటిన షాపింగ్ కాంప్లెక్స్ మాత్రం ఇప్పటికే వినియోగంలోకి రాలేదు. సులభ కాంప్లెక్స్ గా మాత్రం ప్రజలు వినియోగించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అసలుకే మోక్షం లేదు అంటే... మళ్లీ కాంట్రాక్టర్లను బతికించడం కోసం మూడో అంతస్తులు మరిన్ని నిర్మాణాలు చేపట్టి తుండడం చర్చనీయాంశంగా మారింది.

షాపింగ్ కాంప్లెక్స్ పై పట్టింపు ఏది...?

రూ.2 రెండు కోట్ల నిధులతో చేపట్టిన ఈ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ విషయంలో మాత్రం పాలకులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా కు అనుకోని నిర్మించిన ఈ షాపింగ్ కాంప్లెక్స్ లోని 79 గదులను వ్యాపారులకు అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు గతంలో నాలుగైదు సార్లు నోటిఫికేషన్ జారీ చేశారు. గదులను బట్టి నెలకు రూ.8 వేల నుంచి రూ. పదివేల వరకు అధ్యయనం నిర్ణయించారు. అయితే గతంలో లక్ష్మీ నగర్ లోని పలువురు వ్యాపారులు ఒక్కొక్కరు రూ. 50 వేల చొప్పున డిపాజిట్ కూడా చేశారు. ఈ లెక్కన కార్పొరేషన్కు రూ.29 లక్షల వరకు ఆదాయం సమకూరింది. అయినప్పటికీ గదులను మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికీ కేటాయించలేదు. దీంతో ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్ లోని కాళీ గదులు పందులు, పాములు, ఇతర విష కీటకాలకు ఆవాసంగా మారిపోయాయి.

అసలు సమస్య ఎక్కడంటే...

కాగా, ఈ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభానికి నోచుకోకపోవడం వెనుక పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. గోదావరిఖని లక్ష్మీ నగర్, కళ్యాణ్ నగర్, మేజర్ బస్తీ, అశోక్ నగర్ తదితర ఏరియాలలో దుకాణాలు నిర్వహించుకునే వ్యాపారులు యజమానులకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రతి నెల అద్దెలు చెల్లిస్తూ దశాబ్దాల కాలంగా ఇక్కడే షాపులు నడుపుకుంటున్నారు. అలా అద్దెల వల్ల వచ్చిన ఆదాయంతో యజమానులు ఇతర ప్రాంతాలలో భవంతులు, ఇతర వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టారు. కొంతమంది యజమానులు లక్ష్మీ నగర్ లో బిల్డింగులు నిర్మించుకొని షాపులకు అద్దెకు ఇస్తూ వాటితోనే జీవనాధారంగా గడుపుతున్నారు. యజమానులలో చాలామంది రాజకీయ నాయకులు, డాక్టర్లు, పుర ప్రముఖులు ఉన్నారు. ఒకవేళ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభమైతే.. లక్ష్మీ నగర్ లోని ఆయా షాపుల నుంచి వ్యాపారులు ఖాళీ చేసి బల్దియా షాపింగ్ కాంప్లెక్స్ లోకి మారుతారు. దీంతో వ్యాపారాలన్నీ షాపింగ్ కాంప్లెక్స్ లోనే కొనసాగుతాయి. ఇదే జరిగితే లక్ష్మీ నగర్ లోని బిల్డింగులు దాదాపు అన్ని ఖాళీ అయి అద్దెలు రాక యజమానులు ముప్పు తిప్పలు పడే పరిస్థితి తలెత్తుతుంది. అందుకే ఒక వ్యాపార వర్గానికి చెందిన నాయకులు ఒక ఛాంబర్ గా ఏర్పడి ఆ షాపింగ్ కాంప్లెక్స్ వినియోగంలోకి రాకుండా అడ్డుకుంటూ వస్తున్నారని పలు ఆరోపణలు ఉన్నాయి. రామగుండం ప్రస్తుత ఎమ్మెల్యే ఈ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం విషయంలో దృష్టి సారించాలని పలురు వ్యాపారులతో పాటు, స్థానిక ప్రజలు కోరుతున్నారు..

సమీకృత మార్కెట్ అంతేనా...?

ఇక గోదావరిఖని విట్టల్ నగర్ లో మీ సేవ కేంద్రం పక్కన విశాలమైన ప్రభుత్వ స్థలంలో దాదాపు నాలుగు కోట్లతో నిర్మించ తలపెట్టిన సమీకృత మార్కెట్ కూడా ఆదిలోనే హంసపాదు అన్నట్టు అభ్యంతరంగా నిలిచిపోయింది. సిద్దిపేట తరహాలో ఇక్కడ సమీకృత మార్కెట్ నిర్మించేలా అప్పటి ప్రభుత్వం టెండర్లు పిలిచి కరీంనగర్ కు చెందిన ఒక కాంట్రాక్టర్కు పనులప్పగించింది. ఆ సమీకృత మార్కెట్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మధ్యలోనే కరోనా విపత్తు సమయంలో పనులు నిలిపివేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నుంచి సమీకృత మార్కెట్ నిర్మాణం పనులు పునరుద్ధరణ విషయంలో పాలకులు, అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.



Next Story