Protest : డివిజన్‌లో అభివృద్ధి చేయాలి.. బురద రోడ్లపై కార్పొరేటర్ నిరసన

by Aamani |
Protest : డివిజన్‌లో అభివృద్ధి చేయాలి.. బురద రోడ్లపై కార్పొరేటర్ నిరసన
X

దిశ,గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ లో అభివృద్ధి పనులు చేపట్టాలని కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు కాలనీ వాసులతో పాటు బురద రోడ్లపై కూర్చుని వినూత్న నిరసన తెలిపారు. గత కొంతకాలం నుంచి డివిజన్ లో అభివృద్ధి చేయడం లేదంటూ నిరసన నినాదాలు చేశారు. డివిజన్‌లోని పలు కాలనీలు పద్మావతి కాలనీ, కెసిఆర్ కాలనీ, ప్రగతి నగర్, ఆర్టీసీ కాలనీ, సాయి నగర్, చంద్రబాబు కాలనీ, టీచర్స్ కాలనీ, బృందావనం కాలనీ అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు కేటాయించడం లేదని మహిళలు ఆరోపించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నగులూరు సుమలత మాట్లాడుతూ గత రెండేళ్ల క్రితం డివిజన్‌లోని పద్మావతి కాలనీ రోడ్డు నిర్మాణం కోసం టెండర్ వేశారని ఆ టెండర్ కు సంబంధించిన పనులు ప్రారంభించినప్పటికీ ఆదిలోనే ఆగిపోయాయని పేర్కొన్నారు.

ఈ విషయంలో పలుమార్లు కార్పొరేషన్ అధికారులు, పాలకులకు విన్నవించినప్పటికీ ఇలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులను అడిగితే ఈ ప్రాంతంలో రోడ్డు వేయవద్దని అంటున్నారని అనడం విడ్డూరంగా ఉందన్నారు. పద్మావతి కాలనీలో రోడ్డు అధ్వాన్నంగా ఉండడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మట్టి రోడ్డుపై ఉన్న గుంతలలో పడి చిన్న పిల్లలకు గాయాలవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి పద్మావతి కాలనీ రహదారి మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. డివిజన్ నుంచి రామగుండం కార్పొరేషన్ కు అత్యధికంగా ఎల్.ఆర్.ఎస్ నిధులు వస్తున్నప్పటికీ అభివృద్ధి విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ పేర్కొన్నారు. డివిజన్ కు నిధులు కేటాయించాలని, లేదంటే పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.



Next Story