నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ పాసైతే డీఎస్సీకి అర్హులే..!

by Satheesh |
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ పాసైతే డీఎస్సీకి అర్హులే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీలో మార్కులు తక్కువ ఉండి డీఎస్సీ రాసేందుకు అర్హత లేని అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2011 సంవత్సరం కంటే ముందు డిగ్రీ పాసైన అభ్యర్థులకు మార్కులతో సంబంధం లేకుండానే డీఎస్సీకి అప్లై చేసుకోవచ్చని గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత పాసైన అభ్యర్థులకు డీఎస్సీ క్వాలిఫైయింగ్ మార్కుల శాతాన్ని తగ్గించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం జీవో విడుదల చేశారు. గతంలో టీచర్ పోస్టుల భర్తీకి జారీచేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో తెలిపిన మార్కుల శాతానికి సవరణలు చేస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజీ పండిట్, పీఈటీ తదితర పోస్టుల మార్కుల శాతాన్ని తగ్గించారు.

గతంలో డీఎస్సీ నోటిఫికేషన్‌లో డిగ్రీలో ఓసీలకు 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు 45% మార్కులుంటే అర్హులుగా ఉండేది. దీనిపై కొందరు అభ్యర్థులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మార్కుల శాతాల్లో మార్పులను చేస్తూ ఎన్​సీటీఈ గెజిట్ ఉత్తర్వులు జారీచేసింది. 2011 జులై 29 కంటే ముందు పాసైన వారందరికీ మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులుగా ఉంటారని దాంట్లో పేర్కొన్నది. ఆ తర్వాత పాసైన వారికి ఓసీలకు 45%., ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరులకు 40% మార్కులుంటే సరిపోతుందని మరో ఉత్తర్వులో స్పష్టత ఇచ్చింది.

అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్‌సీటీఈ ఉత్తర్వులు పట్టించుకోకుండా.. పాత పద్దతిలోనే మార్కుల అర్హతను పెట్టి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, గత సర్కారు ఇచ్చిన పోస్టులను డబుల్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం 11వేల పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అర్హతలన్నీ పాతవే ఉండటంతో, తాజాగా దీన్ని మార్పులు చేశారు. ఎన్‌సీటీఈ ఉత్తర్వుల ప్రకారం మార్కుల అర్హత శాతాన్ని తగ్గిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కాగా, ఈనెల 20 వరకూ దరఖాస్తునకు అవకాశం ఉండటంతో, తక్కువ మార్కులున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed