State convener Diddi Sudhakar : అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర

by Kalyani |
State convener Diddi Sudhakar : అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర
X

దిశ, హిమాయత్ నగర్ : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ లోతైన కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే ఆయనపై బీజేపీ యువమోర్చా గుండాలతో దాడి చేయించిందని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ పై దాడిని నిరసిస్తూ ట్యాంక్ బండ్, అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఆప్ కార్యకర్తలు జెండాలు, ప్లకార్డులు చేతబూని అరవింద్ కేజ్రీవాల్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ… ద్వేషం, శత్రుత్వం హింసతో కూడిన రాజకీయాలు బీజేపీ చేస్తుందని మండిపడ్డారు. ఈ దాడిలో కేంద్ర మంత్రి అమిత్ షా హస్తం ఉంది కాబట్టే ఢిల్లీ పోలీసులు దాడి చేసిన బీజేపీ గుండాలపై కేసులు పెట్టలేదని ఆరోపించారు. బీజేపీ రాజకీయాలు ఎంత నీచానికి దిగజారిపోతాయో అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగిన సమయంలో ఢిల్లీ ప్రజలు చూశారని అన్నారు. బీజేపీ విద్వేష, హింస రాజకీయాలకు పాల్పడితే ఊరుకునేది లేదని, తిరగబడి ఆప్ కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని డాక్టర్ దిడ్డి సుధాకర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, ఎంఏ. మజీద్, సోలొమన్ రాజ్, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమ జిల్లోజు, నర్సింగ్ యమునా గౌడ్, అధికార ప్రతినిధులు జావీద్ షరీఫ్, అఫ్స సలాం, కాలిం బాబా, నేతలు శివాజీ, కొడంగల్ శ్రీనివాస్, ఇస్మాయిల్, రాకేష్ సింగ్, సుధారాణి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story