కాంట్రాక్టర్‌పై అటెండర్ దాడి.. విరిగిన ముక్కు ఎముక

by Shiva Kumar |
కాంట్రాక్టర్‌పై అటెండర్ దాడి.. విరిగిన ముక్కు ఎముక
X

దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో కాంట్రాక్టర్లతో వివిధ రకాల పనులు చేయించుకుని బిల్లులు చెల్లించకపోవటంతో పాటు బిల్లుల కోసం సర్కిల్ ఆఫీసులకు వస్తున్న కాంట్రాక్టర్లపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మలక్‌పేట సర్కిల్ పరిధిలోని ఇంజినీరింగ్ సెక్షన్‌లోని అటెండర్ ధనుంజయ్ మంగళవారం బిల్లుల కోసం వచ్చిన శ్రీశైలం అనే కాంట్రాక్టర్ పై దాడి చేసినట్లు బాధితుడు వాపోయారు. అటెండర్ తన తలతో ముఖంపై డిచ్చ కొట్టడంతో కాంట్రాక్టర్ ముక్కు ఎముక విరిగింది.

దీంతో బాధితుడు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆ తర్వాత పోలీసుల సూచన మేరకు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అయితే ముక్కు ఎముక విరిగినట్లు సూచించటంతో మెరుగైన వైద్యం కోసం కాంట్రాక్టర్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అటెండర్ ధనుంజయ్ నెల రోజుల క్రితం కూడా ఇదే తరహాలో మలక్‌పేట సర్కిల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఈఈ, కంప్యూటరే ఆపరేటర్లపై దాడులకు పాల్పడినట్లు సమాచారం. అప్పట్లో జోనల్ కమిషనర్ హెచ్చరించినా, అటెండర్ ప్రవర్తనలో మార్పు రాలేదని కాంట్రాక్టర్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ గొడవపై అసలేం జరిగిందో తెల్సుకునేందుకు 'దిశ' అటెండర్ ధనుంజయ్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఆయన రెస్పాన్స్ కాలేదు.

దాడికి కారణం ఇదేనా?

మలక్‌పేట సర్కిల్ ఇంజినీరింగ్ సెక్షన్‌కు చెందిన సిబ్బంది, కాంట్రాక్టర్లు వారం రోజుల క్రితం శివారు ప్రాంతానికి వెళ్లి అక్కడ పార్టీ చేసుకున్నట్లు సమాచారం. పార్టీ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే క్రమంలో అటెండర్ ధనుంజయ్, కాంట్రాక్టర్ శ్రీశైలంల మధ్య చోటుచేసుకున్న చిన్న వాగ్వాదం మంగళవారం కాంట్రాక్టర్ శ్రీశైలంపై దాడికి కారణమైందన్న వాదనలు ఉన్నాయి. బిల్లుల కోసం మంగళవారం సర్కిల్ ఆఫీసుకు వచ్చిన శ్రీశైలంను నిలదీస్తూ అటెండర్ దాడి చేసినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని బాధితుడు పోలీసులకు కూడా చెప్పినట్లు వెల్లడించారు.

Next Story

Most Viewed