Harish Rao : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ.. రిక్వెస్ట్ ఇదే..!

by Rajesh |   ( Updated:2024-08-03 04:35:33.0  )
Harish Rao : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ.. రిక్వెస్ట్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్/ సిద్ధిపేట ప్రతినిధి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు శనివారం లేఖ రాశారు. ఈ లేఖలో సాగునీటిని అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌లు పూర్తిగా నీళ్లు లేక రిజర్వాయర్‌లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు. గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్‌లో 3.32 టీఎంసీల నీళ్ళు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్‌లో 2.38 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.67 టి ఎం సీలు, మల్లన్న సాగర్ 18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్ 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.

ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారని స్పష్టం చేశారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గి పోయిందని.. కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed