పోలీస్ కానిస్టేబుళ్లతో శ్రమదోపిడి..! సీఎంపై ఫైర్ అయిన హరీశ్ రావు

by Ramesh N |   ( Updated:2024-10-15 08:15:02.0  )
పోలీస్ కానిస్టేబుళ్లతో శ్రమదోపిడి..! సీఎంపై ఫైర్ అయిన హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీస్ కానిస్టేబుళ్లకు జరుగుతున్న శ్రమదోపిడి గురించి నాడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా శ్రమ దోపిడీ విధానాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా గతంలో సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకు 15 రోజులకు ఒకసారి బదులు నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్ మాన్యువల్ మార్చడం దుర్మార్గమన్నారు. వారాల పాటు కుటుంబాలకు దూరం చేయడమేనా మీరు పోలీసులకు ఇచ్చిన దసరా, దీపావళి కానుక అంటూ విమర్శించారు. హోం మంత్రిగా, సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి.. టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకు నెలకొకసారి లీవు విధానం అమలు చేయకుండా, ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్, ఏఆర్ ఇతర విభాగాల పోలీసులకు 15 రోజుల టీఏ ఇచ్చేద్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడు రోజులకు దాన్ని కుదించిందని, వారి పొట్ట కొట్టకుండా పాత విధానం ప్రకారమే 15 రోజుల టీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే పెండింగ్‌లో ఉన్న టీఏ, ఎస్ఎల్, జీపీఎఫ్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల సరెండర్ లీవ్ ఎన్ క్యాష్మెంట్ పెండింగ్ డబ్బులు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే క్లియర్ చేయాలన్నారు. సివిల్ పోలీసులు వినియోగించే వాహనాల డీజిల్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం పోలీస్‌స్టే‌షన్ నిర్వహణ కోసం మండల స్టేషన్‌కు 25,000 పట్టణానికి 50,000 హైదరాబాదులో అయితే 75,000 ఇచ్చేవారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ స్టేషన్ నిర్వహణ కోసం నిధులు విడుదల చేయడం లేదన్నారు. దీనివల్ల పోలీసులు, పోలీస్ స్టేషన్ వెళ్ళే ప్రజలపై భారం పడుతుందన్నారు. ఈ నిధుల విడుదల కోసం సీఐలు ప్రభుత్వం వద్ద పైరవీలు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి పోలీస్ స్టేషన్‌ల నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed