మొదలైన రైతుభరోసా అభిప్రాయాల సేకరణ.. తొలిరోజే భట్టి కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |
మొదలైన రైతుభరోసా అభిప్రాయాల సేకరణ.. తొలిరోజే భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని ఈ బడ్జెట్ లోనే రైతుభరోసాకు నిధులు కేటాయించబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకే పంచుతుందని స్పష్టం చేశారు. పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశామని ఇచ్చి హామీని అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నామన్నారు. రైతు భరోసా గంభీరమైన అంశం అన్నారు. రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పనలో భాగంగా కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభిప్రాయాలను సేకరిస్తోంది. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కమిటీ అధ్యక్షుడు భట్టి విక్రమార్కతో పాటు సభ్యులైన మంత్రులు పొంగులేటి, తుమ్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతులు పెద్ద ఎత్తున ఆధారపడిన సాగు రంగాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం విడుదల చేయకుండా పెండింగ్ లో పెట్టిన రైతుబంధు నిధులను సమయానుకూలంగా తమ ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంటు బడ్జెట్ ను ప్రవేశ పెట్టిందన్ని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నదని చెప్పారు.. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉందని, రైతుల ఆలోచన ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటోందన్నారు. అందుకే రైతుల నుంచి వచ్చే ప్రతిసూచనను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

ఆ కథనాలు నమ్మకండి: తుమ్మల

రైతుల ఆలోచన ప్రకారమే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్లబోతున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో అమలైన రైతుబంధు పథకంలోని లోపాలు దాని వల్ల ఆర్థిక నష్టం అందరి కళ్లముందు ఉందన్నారు. అటువంటి పద్దతిలో కాకుండా నిజమైన రైతులు, కష్టపడే చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రైతుల మనోభావాల మేరకే వారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ అభిప్రాయ సేకరణ చేపడుతున్నామన్నారు. రైతు భరోసా విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పది జిల్లాల్లోని రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే విధివిధానాలపై ఓ నిర్ణయం ఉంటుందన్నారు. అప్పటి వరకు రైతులకు ఆర్థిక సహాయం విషయంలో మీడియాలో వచ్చే కథనాలను నమ్మొద్దన్నారు.

నాలుగు గోడల మధ్య నిర్ణయాలు కాదు: పొంగులేటి

గత ప్రభుత్వంలో ప్రజాభిప్రాయాలు లేకుండానే నాలుగు గోడల మధ్య నిర్ణయాలు జరిగేవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పాలకులు తీసుకున్న నిర్ణయం ప్రజలపై బలవంతంగా రుద్ధారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలు వివిధ రూపాల్లో కడుతున్న డబ్బేనని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ప్రజల నుంచి అభిప్రాయాలు వస్తేనే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తుందన్నారు. రాష్ట్రమంతటా అన్ని ఉమ్మడి జిల్లాల్లో ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఏం చేసిందో ప్రజలే తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నారు. ప్రజల మనోగతానంతా అసెంబ్లీలో చర్చకు పెడతామన్నారు.



Next Story

Most Viewed