HARISH RAO: మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ట్వీట్

by Anjali |   ( Updated:2024-08-27 15:44:50.0  )
HARISH RAO: మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ పాలనపై మరో సంచలన ట్వీట్ చేశారు. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కాంగ్రెస్ పాలనలో దిక్కులేకుండా పోయిందని మండిపడ్డారు. నిత్యం వేలాదిమందికి వైద్యసేవలు అందించే ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నదని అన్నారు. ఆసుపత్రిలో మందుల కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మందులు లేవని చేతులెత్తేయడంతో చేసేది లేక రోగులు ప్రైవేటు ఫార్మసీలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించి మందులు కొనుగోలు చేస్తూ ఆర్థిక భారాన్ని మోస్తున్నారని తెలిపారు.

మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని గొంతెత్తి ప్రశ్నించారు. ఒక్క ఎంజీఎం ఆసుపత్రే కాదు దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు నిండుకున్నాయన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మూడు నెలలకు సరిపడా మందులు బఫర్ స్టాక్ గా పెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ సర్కారు ఎందుకు విస్మరిస్తున్నదని అడిగారు. ప్రైవేటు మెడికల్ షాపులకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల సరఫరా నిలివేస్తున్నట్లా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో ప్రైవేటు ఫార్మసీలను ఎందుకు కొనసాగిస్తున్నట్లు? ఆసుపత్రులకు మందులు సరఫరా చేయాల్సిన టిఎస్ఎంఎస్ఐడీసీ ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రులకు శాపంగా మారుతుందని, బీఆర్ఎస్ పాలనలో ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వ ఆసుపత్రులు కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా స్పందించి అన్ని రకాల మందులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులపై ఆర్థిక భారం పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed