KCR: సముచిత స్థానం కల్పిస్తాం.. పార్టీ పూర్వ వైభవానికి కష్టపడండి

by Gantepaka Srikanth |
KCR: సముచిత స్థానం కల్పిస్తాం.. పార్టీ పూర్వ వైభవానికి కష్టపడండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: యువతకు బీఆర్ఎస్ పార్టీలో పెద్దపీట వేస్తామని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో బీసీ కమిషన్ మాజీ సభ్యులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎర్రవల్లిలోని ఫాం హౌజ్‌లో శుక్రవారం బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. బీసీ కమిషన్ అధ్యయనం చేసిన అంశాలు సైతం చర్చకు వచ్చినట్లు సమాచారం. బీసీ కమిషన్ సభ్యులుగా అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించినందుకు కేసీఆర్ వారిని అభినందించారు. ప్రజాక్షేత్రంలో పార్టీకి పూర్వవైభవం వచ్చేలా కష్టపడాలని సూచించారు. యువత, విద్యార్థుల సమస్యలపైనా గళమెత్తాలని, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. త్వరలో వేయబోయే కమిటీల్లోనూ ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story