Eleti: హామీలు మరిచారా? లేక నటిస్తున్నారా?.. బీజేఎల్పీ నేత హాట్ కామెంట్స్

by Ramesh Goud |
Eleti: హామీలు మరిచారా? లేక నటిస్తున్నారా?.. బీజేఎల్పీ నేత హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచిందా? లేక మరిచినట్లు నటిస్తున్నారా? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్రించారు. ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు హామీల సాధన దీక్ష ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలేటి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అలవి కానీ హామీలిచ్చి, రైతన్నలను మోసం చేసిందని అన్నారు. ఆనాడు వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో అధికారంలోకి రావడానికి ప్రతీ సంవత్సరం దాదాపు 81 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీలను మర్చిపోయారా? లేక మర్చిపోయినట్లు నటిస్తున్నారా? లేదంటే మొత్తానికే గజినీలా మారిపోయారా చెప్పాలన్నారు.

ఒకే సంతకంతో 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, ఈ రోజు 17 వేల 933 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారని, అంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి, రెండవ వంతు రైతాంగాన్ని మోసం చేశారని తెలిపారు. అలాగే మీరు ఇస్తా అని చెప్పిన రైతు బంధు, రైతు కూలీలకు డబ్బులు, కౌలు రైతులకు న్యాయం హామీలు ఎక్కడికి పోయాయని, దీనివల్ల దాదాపు వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. అంతేగాక గత నెల 15 వరకు 870 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని నివేదికలు చెబుతుండగా.. ఈ రోజు వరకు 1000 మంది ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కి వాళ్లనే మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీజేపీ రైతన్నల పక్షాన నిలబడి, పోరాటం చేస్తుందని, ప్రభుత్వం మెడలు వంచి హామీలు నెరవేరే వరకు రైతన్నలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే చనిపోయిన రైతన్నల ఆత్మకు శాంతి చేకూరాలని బీజేపీ నేతలు కాసేపు మౌనం పాటించారు.

Advertisement

Next Story

Most Viewed