ప్రధాని మోడీపై డిప్యూటీ CM భట్టి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
ప్రధాని మోడీపై డిప్యూటీ CM భట్టి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అగ్నివీర్‌ను రద్ధు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం ఆయన పంజాబ్ రాష్ట్రం ఫరీద్ కోట్ లోక్ సభ పరిధిలోని కోటక్ పుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ...దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నదని, దీని వలన యువతకు తీరని నష్టం వాటిల్లుతోందన్నారు. బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం, అవినీతి, అస్థిరతతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఎన్నికల్లో దేశ ప్రజలు ఒక పెద్ద మార్పు తీసుకురాబోతున్నారని తెలిపారు. ఇండియా కూటమికి వస్తున్న ఆదరణ చూసి మోడీ తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఆ క్రమంలో విపక్షాలపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల వేళ గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోవాల్సిన ప్రధాని మోడీ మతం, మంగళసూత్రం, ముజ్రా వంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఆయన ప్రధాని పదవి గౌరవాన్ని తగ్గిస్తున్నారని అన్నారు. పాకిస్తాన్ తో పోరాడి బంగ్లాదేశ్ కు స్వతంత్రం తెచ్చిపెట్టామన్నారు. చైనా మన దేశ భూమిని ఆక్రమించి ఇల్లు, రోడ్లు నిర్మిస్తున్నా, ప్రధాని మోడీ మౌనంగా ఉండడం దేనికి సూచిక అని ప్రశ్నించారు. పదేళ్లు పవర్ లో ఉన్న బీజేపీనే దీనికి కారణమన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి మూల్యం తప్పదన్నారు. ప్రధాని స్థాయికే కళంకం తెచ్చారన్నారు. ఇక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హామీ ఇచ్చారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుందని, రైతులకు రుణమాఫీ అవసరమైన ప్రతిసారి ఆ కమిటీ ప్రభుత్వానికి తెలియజేస్తుందన్నారు. ఆ కమిటీ సిఫారసులను ప్రభుత్వం తు.చ తప్పక అమలు చేస్తుందన్నారు.

మోడీ భారత సైనికులను కార్మికులుగా మార్చి రెండు రకాల అమరవీరులను సృష్టించారని విమర్శించారు. అమరవీరుల హోదా, పెన్షన్ తో పాటు అన్ని సౌకర్యాలు పొందే వారు ఒకరైతే, పేద కుటుంబాల యువతకు మాత్రం ఇలాంటి గౌరవాలు, సౌకర్యాలు లేకుండా వివాదాస్పద పథకాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అగ్ని వీర్ పథకం సైన్యం ఆలోచన కాదని ఇది మోడీ కుట్రపూరిత పథకమని విమర్శించారు. ప్రభుత్వాన్ని బిలియనీర్ లైన అదాని, అంబానీలు నడుపుతున్నారన్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు ప్రధాని అదాని గ్రూపులకు విక్రయించి మోడీ తన పరువు పోగొట్టుకున్నారన్నారు. ఈ దేశం పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



Next Story