రైతాంగానికి తీవ్ర నిరాశ.. ఐదు జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరం

by Vinod kumar |
రైతాంగానికి తీవ్ర నిరాశ.. ఐదు జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టంలో వర్షాకాల సీజన్లో వర్షాలు అధికంగా కురుస్తాయని ఆశలు పెట్టుకున్నా రైతాంగానికి జులై, ఆగష్టు మాసాలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు దాపురించడం, దానికితోడు ఎండాకాలాన్ని తలపించేటంత ఎండలు ఉండటంతో గాలిలో తేమశాతం తగ్గి పైర్లు ఎండిపోతున్నాయి. వారం పదిరోజుల్లో వర్షాలు కురియకపోతే ప్రస్తుతం వేసిన అరకొర పంటలు కూడా ఎండిపోయే పరిస్థితులు కన్పిస్తుండటంతో రైతాంగానికి దిక్కుతోచడం లేదు. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన స్థాయిలో రైతులు సాగుకు మొగ్గుచూపడంలేదు. అందుకు కారణం సకాలంలో వర్షాలు కురవకపోవడంతోపాటు రైతు ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా తయారుకావడమేకారణమన్న ఆందోళన సర్వత్రా విన్పిస్తోంది. పంటలు ఎండిపోతున్న ఈ పరిస్థితులను గమనించిన రాష్ట్ర వ్యవసాయశాఖ రాష్టంలోని ఐదు జిల్లాలో ఈ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పేర్కొన్నది.

ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 4.96 లక్షల ఎకరాల్లోని మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, వరి, పెసర, కంది, జొన్న పంటలు ఎండిపోతున్నాయని తెలిపింది. 15 రోజులుగా వర్షాలు కనుమరుగు కావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వ్యవసాయ శాఖా తన నివేదికలో పేర్కొంది. దీంతో జిల్లా వ్యవసాయాధికారుల నేతృత్వంలో కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే), తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, స్థానిక అధికారులతో కలసి సంయుక్త బృందాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించాలని సూచించింది. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పేర్కొంది.

రాష్ట్రంలో 81 శాతం విస్తీర్ణంలో అన్ని రకాల పంటల సాగు జరిగింది. 1.07 కోట్ల ఎకరాల్లో సాధారణంగా పంటల సాగు జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 86.54 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో ఆహారధాన్యాల సాగు 48.11 లక్షల ఎకరాల్లో కావాల్సి ఉండగా ఇప్పటివరకు 43.54 లక్షల ఎకరాల్లో 90% సాగయ్యింది. అందులో వరి సాధారణ విస్తీర్ణం 24.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 12.62 లక్షల ఎకరాల్లో 52% మాత్రమే నాట్లు వేశారు. వర్షాలు లేకపోవడం ముఖ్య కారణం కాగా భూగర్భ జలాలు పెరగకపోవడం, జలాశయాల్లోకి నీరు గరిష్ట స్థాయిలోకి రాకపోవడంతో మార్ కారణం కావడంతో నాట్లు పడడంలేదని తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు మాత్రమే నాట్లకు అనుకూలమని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో పప్పుధాన్యాలు, మొక్కజొన్న సహా కొన్ని పంటలు మాత్రమే సాధారణం కంటే అధికంగా సాగుచేశారు

ఆగష్టు మాసంలో 171 .4 మీ మీ లకు కేవలం 58 మీ మీ వర్షపాతం నమోదు

ఖరీఫ్ ప్రారంభమైన జూన్‌లో వర్షాలు కాస్త కురిసిన సాధారణ వర్షపాతం 127.6 మిల్లీమీటర్లు కాగా.. 190.9 ఎంఎంలు కురిసింది. అయితే ఆగస్టులో ఇప్పటివరకు 171.4 మీ మీలు వర్షాలు కురవాల్సి ఉండగా.. కేవలం 58 మిల్లీమీటర్లే వర్షం పడింది. మొత్తంగా ఈ మూడు నెలల కాలంలో మెదక్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో లోటు, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

Advertisement

Next Story