కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ సంచలన పిలుపు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-16 14:18:33.0  )
కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ సంచలన పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేండ్లు రాష్ట్ర సంపదను దోచుకుని, పదవులు అనుభవించి, వేలాది ఎకరాల భూముల్ని ఆక్రమించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కుటుంబ పాలన అంటూ కాంగ్రెస్‌(Congress)పై కామెంట్లు చేయడాన్ని తప్పుపట్టిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)... కేసీఆర్(KCR) కుటుంబ సభ్యుల ఫామ్ హౌజ్‌లలో, గడీల్లో జిల్లేళ్లు మొలిపిస్తా అని హెచ్చరించారు. “గడీలలో గడ్డి మొలవాల్సిందేనంటూ ఆనాడే చాకలి ఐలమ్మ చెప్పారు... ఇప్పుడు ఆ స్ఫూర్తితో రాజీవ్‌గాంధీ విగ్రహం సాక్షిగా చెప్తున్నా... మీ ఫామ్ హౌజ్‌లలో జిల్లేళ్లు మొలవాల్సిందే... అప్పటివరకూ కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరు... ఏ ఫామ్ హౌజ్‌లూ వారిని కాపాడలేవు..” అని కేసీఆర్, కేటీఆర్‌లను (పేరు పెట్టకుండా) సీఎం రేవంత్ హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ లీడర్లు ఎవరైనా ఏమన్నా అంటే తాను చూసుకుంటానని అన్నారు. అధికారం పోయినా వారికి మదం తగ్గలేదన్నారు. “కొంతమంది చిల్లరగాళ్లను మనపైకి ఉసిగొల్పుతున్నారు... కాలకేయ ముఠా మిడతల దండుగా మారి తెలంగాణను మింగేసేందుకు మళ్లీ ఊళ్ల మీదకు రాబోతున్నది... తెలంగాణ ప్రజలారా అప్రమత్తం కండి... ఈ మిడతల దండును తెలంగాణ పొలిమేరలకు తరమాలి...” అని అప్పీల్ చేశారు.

కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ఫామ్ హౌజ్‌లు కట్టుకున్నారని, ఒకరికి వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌజ్, ఇంకొకరికి వంద ఎకరాల్లో.. ఇంకొకరికి పది ఎకరాల్లో ప్రగతి భవన్... వాస్తు సక్రమంగా లేదని కొత్త సచివాలయం... లక్ష కోట్లు దిగమింగి కాళేశ్వరం... ఇవన్నీ కేసీఆర్ కుటుంబ చరిత్ర అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఇంత దోపిడీ చేసిన ఆ కుటుంబానికి పదేండ్ల కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న సోయి లేదా అని ప్రశ్నించారు. వారికి ఆ సోయి లేదు కాబట్టే తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా ఉండే సచివాలయంలో తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామని, రాష్ట్ర ప్రజలకు మాట ఇస్తున్నానని అన్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఇక్కడ పెడతామనాగానే వారికి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనేది గుర్తుకొచ్చిందన్నారు. ఇక్కడి నుంచి రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటూ కొందరు సన్నాసులు మాట్లాడుతున్నారుగానీ ఎవడొస్తాడో డేట్ ఫిక్స్ చేసి చెప్పాలని, కాంగ్రెస్ కార్యకర్తలు వారి సంగతి చూసుకుంటారని హెచ్చరించారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడమే సముచితమన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అవసరాల కోసం ఆశ్రయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కనీసం ఆయన చివరి చూపుకు కూడా వెళ్లని దుర్మార్గుడు కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తాము మాత్రం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నామని, మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించామని గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సందర్భంగా ఇక్కడ రాజకీయాలు ప్రస్తావించడం తనకు ఇష్టం లేకపోయినా కొంతమంది చిల్లరగాళ్ళు (బీఆర్ఎస్ నేతలను పరోక్షంగా ఉదహరిస్తూ) చేసే కామెంట్లకు ఈ వేదిక నుంచే కొన్ని విషయాలను గుర్తుచేయాలన్న భావనతో వీటిని చెప్పాల్సి వస్తున్నదన్నారు. అడ్డగోలుగా వేల కోట్ల రూపాయల్ని కూడబెట్టుకున్నవాళ్లకు త్యాగం అంటే ఏమిటో గుర్తు చేయదలచుకున్నానని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిట్ జవహర్ లాల్ నెహ్రూదని, సర్వం కోల్పోయిన కుటుంబమని, 563 సంస్థానాలను దేశంలో విలీనం చేయించి దేశ సమగ్రతను కాపాడిన ఘనత ఆయనదని గుర్తుచేశారు.

మతకల్లోలాలతో దేశంలో రక్తం ఏరులై పారుతుంటే దార్శకనికతను ప్రదర్శించి శాంతిని నెలకొల్పింది సెహ్రూ కాదా అని ప్రశ్నించిన సీఎం రేవంత్.. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి దేశ భవిష్యత్తుకు పునాదులు వేశారని గుర్తుచేశారు. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ మనకు అందించిన సంపద అని, కొంతమంది సన్నాసులు వారసత్వ రాజకీయల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ బ్రతికి ఉండగా ఇందిరాగాంధీ ఏ పదవినీ తీసుకోలేదని, ఇప్పటికీ ఇందిరమ్మను పేదలు దేవతలా పూజిస్తున్నారని పేర్కొన్నారు. బ్యాంకుల జాతీయకరణ చేసి పేదల అభివృద్ధికి కృషి చేశారని, రాజభరణాలు రద్దు చేశారని, దళిత, గిరిజన, బలహీన వర్గాల ఆత్మగౌరవం పెరిగేలా భూములు పంచి పెట్టారని, పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి వారికి సొంతింటి కలను నిజం చేశారని, లంబాడాలను ఎస్టీలలో చేర్చారని, దేశంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని, దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకూ కృషి చేసిన త్యాగశీలి అని పేర్కొన్నారు.

దేశానికి నాయకత్వ సమస్య వచ్చినపుడు ప్రజల కోసం రాజీవ్‌గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని, దేశ భవిత యువత చేతుల్లో ఉండాలనే ఉద్దేశంతో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించి గ్రామ పంచాయతీలకు నిధులు చేరేలా సంస్కరణలు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కిందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి ఆడబిడ్డలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించింది రాజీవ్‌గాందీ అని వివరించారు. ఐదేళ్లపాటు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని సన్నాసులకు మాహిళల ఆత్మ గౌరవం గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. రాజీవ్‌గాంధీ మరణించినా సోనియాగాంధీ అప్పటి కేంద్ర ప్రభుత్వంలో ఏ పదవీ తీసుకోలేదని, 2004-2014 మధ్యకాలంలో రాహుల్‌గాంధీ కూడా ఏ పదవినీ అనుభవించలేదన్నారు. ప్రాణత్యాగం అంటే ఇందిరాగాందీ, రాజీవ్‌గాంధీ లది అని నొక్కిచెప్పిన సీఎం రేవంత్... పదవీ త్యాగం అంటే సోనియా, రాహుల్ గాంధీలదన్నారు. చివరకు తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావును దేశ ప్రధానిని చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.

ఈ దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ కంప్యూటర్‌ను పరిచయం చేసి ఉండకపోతే కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునే వాడన్నారు. లేదంటే సిద్దిపేటలో చాయ్ అమ్ముకునే వాడన్నారు. రాజీవ్‌గాంధీ ఆనాడు కంప్యూటర్‌ను పరిచయం చేయకుంటే కేటీఆర్ గత ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేసేవాడా?... ట్విట్టర్‌లో మెసేజ్‌లు పెట్టేవాడా?.. ఇప్పుడు ఈ స్థాయికి చేరేవారా అని ప్రశ్నించారు. అధికారం పోయినా మదం దిగలేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed