ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్

by GSrikanth |
ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి నిలబెట్టుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని చెప్పిన ఆయన దానిని నిజం చేశారు. ఈ వివరాల ప్రాతిపదికగానే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా ఇంటి స్థలం, గౌరవ భృతి కల్పించనున్నారా? అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. 1969లో జరిగిన ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేయాలంటూ తాజాగా డిమాండ్​వినిపిస్తోంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో వేలాది మందిపై కేసులు నమోదయ్యాయయి. 12‌‌‌‌00 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పిన బీఆర్ఎస్​ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్​అధికారంలోకి వస్తే ఉద్యమకారులపై నమోదైన అన్ని కేసులను ఎత్తివేస్తామని అప్పటి టీపీసీసీ చీఫ్‌ రేవంత్​రెడ్డి తెలిపారు. అన్నట్లుగానే ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని పొందుపరిచారు. దాంతోపాటు ఉద్యమకారుల కుటుంబాలకు గౌరవ భృతి కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 2009, డిసెంబర్​9వ తేదీ నుంచి 2‌‌014, జూన్​6వ తేదీ మధ్యన తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలను తెప్పించాలని పోలీసు శాఖకు సూచించారు. సీఐడీ అదనపు డీజీ మహేశ్​భగవత్,​డీజీపీతోపాటు మల్టీ జోన్​ఐజీలకు ఈ బాధ్యతలు అప్పగించారు.

వివరాల సేకరణలో నిమగ్నం

రాష్ర్టం మొత్తం మీద ఉన్న దాదాపు 900 పోలీస్​స్టేషన్ల నుంచి ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలను సేకరించనున్నారు. సీరియల్​నెంబర్, క్రైం నెంబర్, ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు తదితర వివరాలన్నీ పొందుపరచనున్నారు. ప్రస్తుతం కేసు ఏ స్టేజీలో ఉంది అన్న సమాచారం సైతం తెలుసుకోనున్నారు. ఏవైనా అనుమానాలు ఉంటే 8712596717 నెంబర్‌పై సీఐడీ సీఐలు నవీన్​బాబు, 9959246357 నెంబర్‌పై శేఖర్​రెడ్డిని సంప్రదించాలని సూచించారు.

ప్రాతిపదిక ఇదే?

తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతోపాటు గౌరవ భృతి ఇస్తామని కాంగ్రెస్​తన మేనిఫెస్టోలో పేర్కొన్నది. ఈ క్రమంలో ప్రస్తుతం సేకరిస్తున్న కేసుల వివరాలు, వాటిల్లో నిందితులుగా నమోదైన వారికి ఇళ్ల స్థలాలు, గౌరవ భృతి ఇవ్వనున్నారన్న చర్చ నడుస్తోంది. సర్క్యులర్‌లో అరెస్టయి జ్యుడిషియల్​రిమాండ్‌కు తరలించిన వివరాల గురించి మాత్రమే అడిగారు. ఆత్మాహుతి చేసుకున్న వారి వివరాలు కోరలేదు. మలి దశ ఉద్యమంలో అమరులైన కుటుంబాల కోసం ఏం చేయనున్నారన్న దానిపై స్పష్టత రాలేదు. 1969 ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానాలు చేసిన 369 మంది కుటుంబాలకు ప్రభుత్వం ఏదైనా మేలు చేకూర్చనుందా? అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే ఉంది. తమకూ న్యాయం చేయాలంటూ శుక్రవారం వారి మలిదశ ఉద్యమ కుటుంబీకులు అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed