KTR : తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Rajesh |
KTR : తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు పార్టీ ఫిరాయింపులపై స్పందించిన ఆయన మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధులు ఈ మేరకు త్వరలోనే సమావేశం కానుందన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు తెలిపినట్లు గుర్తు చేశారు.

ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్‌కు సంబంధించి ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందనిరాజ్యాంగ నిపుణులు చెట్పట్ ఆర్యమా సుందరం పార్టీ బృందానికి తెలిపారన్నారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్‌తో పాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్‌కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు.

సుప్రీంకోర్టు తీర్పులతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు. ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపైన సుద్దపూస ముచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెబుతామన్నారు. రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులతో జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed