BREAKING: కాంగ్రెస్ ప్రభుత్వం.. అర్బక ప్రభుత్వం: బడ్జెట్‌పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |
BREAKING: కాంగ్రెస్ ప్రభుత్వం.. అర్బక ప్రభుత్వం: బడ్జెట్‌పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం అర్బక ప్రభుత్వమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ విరామంలో ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌లో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఏడు నెలలైనా కొత్త పాలసీ ఫార్ములేషన్ లేదని అన్నారు. స్టేట్ బడ్జెట్ ఒక ట్రాష్.. దాని నిండా గ్యాసే ఉందని ఎద్దేవా చేశారు. దళితబంధు ప్రస్తావన ఎక్కడా రాకుండా దళితుల గొంతు కోశారని ఆక్షేపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు మొండిచేయి చూపారంటూ అన్నారు. గొర్రెల స్కీమ్‌ను ఏకంగా ఎత్తివేసి యాదవ సోదరులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. బడ్జెట్‌లో ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించకపోవడం వారి పనితీరుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని అనుకున్నాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు పాలసీనే లేదన్నారు. ఆ విషయం బడ్జెట్ చూశాక అర్థం అయిందని అన్నారు. పేదలకు పాలసీలు కూడా లేవని, నిర్దిష్టంగా ఓ లక్ష్యం, పద్ధతి, పద్దు లేదన్నారు. వ్యవసాయ పాలసీ, పారిశ్రామిక, ఐటీ పాలసీలు బడ్జెట్‌లో ఎక్కడా కనిపించకపోవడం ప్రభుత్వా ఉదాసీన వైఖరిని నిదర్శనమని అన్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రజల ఆశలపై భట్టి బడ్జెట్ నీళ్లు చల్లిందంటూ గులాబీ బాస్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.



Next Story