దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా బీజేపీ పాలన: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

by Kalyani |
దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా బీజేపీ పాలన: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
X

దిశ, రంగారెడ్డి బ్యూరో/ఇబ్రహీంపట్నం: దేశంలో బీజేపీ రాక్షస పాలన చేస్తూ ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు, ప్రజాస్వామ్యానికి కాపాడేందుకు 19 రాజకీయ పార్టీలు ఒకే వేదికపై వచ్చాయని గుర్తుచేశారు. ఇలాంటి సందర్భంలో సీఎం కేసీఆర్​ కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్​ ఒక్కరే ఒంటరిగా కొట్లాడితే ఫలితం లేదన్నారు. ఊరంతా ఒక్కదారైతే ఊసుకండ్లోడిది ఇంకోదారి అనే పద్దతిలో ఉంటుందని ఎద్దేవా చేశారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అంబేద్కర్​ చౌరస్తాలో బీజేపీ కో హాటావో దేశ్​కి బచావోతో సీపీఐ నిర్వహించిన ఇంటింటి పాదయాత్ర ముగింపుసభలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరై మాట్లాడారు. వాజిపేయి ప్రజాస్వామ్య పద్దతిలో పనిచేస్తే ఇప్పుడు మోడీ, అమిత్​షాలు అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇదే మోడి ప్రభుత్వంలో 24 మందిపై లైంగిక, ఆత్మహాత్య, నగదు ఎగగొట్టే, ఊచకోత వంటి క్రిమినల్​ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.

వీరందరిపై చట్టబద్దంగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదానీ, అంబానితో మీకున్న సంబంధాలు ఏమిటని లోక్​సభలో ప్రశ్నించినందుకు రాహుల్​గాంధీపై వ్యూహాత్మాకంగానే కుట్ర చేశారని అన్నారు. రాహుల్​ గాంధీ కుటుంబం దేశం కోసం ఆస్తులను అప్పగించింది, అమరులైన చరిత్ర ఉందన్నారు. అలాంటి కుటుంబంపై కక్షపూరితంగా కేసు నమోదు చేయడం, అవినీతి మెజిస్ట్రేట్​తో తీర్పు చెప్పించడం జరిగిందన్నారు. దేశంలో అవినీతి ఎక్కువైపోయిందని అందువలన ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు నారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రచారీ, ముత్యాల యాదగిరి రెడ్డి, ఓరుగంటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed