రూల్స్ ప్రజలకేనా? కేబుల్ బ్రిడ్జి‌పై బర్త్‌డే పార్టీ.. వివాదంలో మాదాపూర్ సీఐ

by Disha Web Desk 14 |
రూల్స్ ప్రజలకేనా? కేబుల్ బ్రిడ్జి‌పై బర్త్‌డే పార్టీ.. వివాదంలో మాదాపూర్ సీఐ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాదాపుల్ సీఐ గడ్డం మల్లేష్ వివాదంలో చిక్కుకున్నారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. కేబుల్ బ్రిడ్జ్‌పై బర్త్ డే వేడుకలు, పార్టీలు నిషేధం అంటూ గతంలో ఆయనే ప్రకటించి.. నేడు రూల్స్ బ్రేక్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. వంతెనపై బర్త్ డే వేడుకలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని, సెక్షన్ 188 ప్రకారం శిక్ష అర్హులని గతంలో సీఐ ప్రకటన చేశారు. అయితే ఇలా ప్రకటన చేసిన ఆయనే రూల్స్ బ్రేక్ చేశారు. తాజాగా అదే కేబుల్ బ్రిడ్జిపై పుట్టిన రోజు వేడుకల్లో మాదాపూర్ సీఐ మల్లేష్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రూల్స్ ప్రజలకు మాత్రమేనా? అంటూ నెటిజన్లు సీఐపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ ట్విట్టర్ వేదికగా నెటిజన్లు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ ఐకానిక్‌ వంతెనగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఎంతో ప్రసిద్ధి చెందింది. శని, ఆదివారాల్లో కేబుల్ బ్రిడ్జిపై సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బ్రిడ్జి పై నుంచి చాలామంది ఫ్రెండ్స్‌తో కలిసి సెల్పీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీంతో బ్రిడ్జిపై రద్దీ భారీగా పెరగడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల నివారణకు గత నెల 16వ తేదీ నుంచి పోలీసులు ఆంక్షలు విధించారు. బ్రిడ్జిపై వాహనాలు నిలపడం, పార్టీలు, ఫోటోలు తీసుకోవడం పై నిషేధం విధించారు. ఎవరైనా ఫొటోల కోసం కేబుల్ బ్రిడ్జి పైకి వస్తే రూ. 1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని పోలీసులు గతంలో హెచ్చరించారు.

Next Story