Assembly: ఏం మొహం పెట్టుకొని అంటున్నారు.. సబితా ఇంద్రారెడ్డిపై డిప్యూటీ సీఎం ఫైర్

by Ramesh Goud |
Assembly: ఏం మొహం పెట్టుకొని అంటున్నారు.. సబితా ఇంద్రారెడ్డిపై డిప్యూటీ సీఎం ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీలో పదవులు అనుభవించి స్వలాభం కోసం బీఆర్ఎస్ వెళ్లారని, ఏం మోహం పెట్టుకొని సీఎం గురించి మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం చేసిన వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సబితా ఇంద్రారెడ్డి గారు చాలా బావోధ్వేగంతో మాట్లాడారని అన్నారు. 2004కు ముందు ఆమె వేరే పార్టీలో ఉంటే.. కాంగ్రెస్ పార్టీ పిలిచి టికెట్ ఇచ్చి, మంత్రిని కూడా చేసిందని, అలాగే 2009 లో కూడా మంత్రిని చేసిందని, పదేళ్ల పాటు ముఖ్యమైన పోర్ట్ ఫోలియోలు ఇచ్చి గౌరవం ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. దళిత వర్గాలకు చెందిన నన్ను ప్రతిపక్ష నాయకుడిగా నిర్ణయించిందని తెలిపారు.

ఆ సమయంలో నాకు సపోర్టుగా ఉండకుండా వారి స్వలాభం కోసం పార్టీ మారి కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను స్వయంగా నాయకులతో కలిసి వారి ఇంటికి వెళ్లి మీరు పార్టీ మారితే ఎల్ఓపీ స్టేటస్ పోతుంది. కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేయలేదు.. ఇకపై కూడా తక్కువ చేయదు అని బ్రతిమలాడినా.. ఒక్క సారైనా ఆలోచన చేశారా అని మండిపడ్డారు. మీ అధికారం కోసం, మీ స్వార్దం కోసం వెళ్లి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు భాదపడుతున్నారని.. ఆవేధన చెందాల్సింది నేనా, కాంగ్రెస్ పార్టీయా, ఈ రాష్ట్రంలోని ప్రజాస్వామ్యమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ఇంకా ఏం మొహం పెట్టుకొని సీఎం గారిని అంటున్నారని, పార్టీలు మారి పరువు తీసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.

Advertisement

Next Story