Kandi Srinivas Reddy : బీజేపీ లో బీఆర్ఎస్ విలీనానికి ఈ జిల్లా నుంచే బీజం..

by Sumithra |
Kandi Srinivas Reddy : బీజేపీ లో బీఆర్ఎస్ విలీనానికి ఈ జిల్లా నుంచే బీజం..
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీకు ఉన్న బంధం బయటపడిందని, ఈ జిల్లా నుంచే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి బీజం పడిందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. వాటి అనైతిక బంధంతో పాటు కుట్ర‌లు, కుతంత్రాలు తేట తెల్లం అయ్యాయ‌ని గురువారం జిల్లా కేంద్రంలోని ప్రజాసేవంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఈ రాజ‌కీయ‌ ప‌రిణామాల‌తో ఈ రెండు పార్టీలు ఒక్క‌టి కాబోతున్నాయ‌నే సంకేతాలు నిజమ‌వుతున్నాయంటూ ఆయ‌న పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో అవిశ్వాసం నెగ్గిన‌ప్ప‌టికీ.. రాబోయే అన్ని ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. మైనార్టీ నేత‌ను గ‌ద్దె దించి వారికి బీజేపీ, బీఆర్ఎస్‌లు వ్య‌తిరేక‌మ‌ని మ‌రోసారి రుజువు చేశాయ‌న్నారు. ఇన్నాళ్లు న‌మ్మిమోస‌పోయిన మైనార్టీ ప్ర‌జ‌లంతా ఇది గుర్తుంచుకొని, భ‌విష్య‌త్తులో వారికి గ‌ట్టి బుద్ధిచెబుతారంటూ హెచ్చరించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మాట్లాడార‌ని అందుకే బీఆర్ఎస్ కు బీజేపీ మున్సిపల్ అవిశ్వాస సమావేశంలో మద్దతునిచ్చింద‌ని ఆరోపించారు. రాష్ట్రస్థాయిలో రెండుపార్టీల బహిరంగ పొత్తుకు, జరగబోయే విలీనానికి ఆదిలాబాద్ నుండే నాంది ప‌ల‌క‌బోతున్నారన్నారు. అందులో భాగంగానే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీఆర్ఎస్ పెట్టిన అవిశ్వాసానికి హాజరయ్యార‌న్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మైనార్టీ నేత‌ జహీర్ రంజాని, పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, బాయిన్ వార్ గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



Next Story