రాహుల్ ప్రధాని అయిన వెంటనే ఆ పని చేయాలి: మాజీ ఎంపీ

by Gantepaka Srikanth |
రాహుల్ ప్రధాని అయిన వెంటనే ఆ పని చేయాలి: మాజీ ఎంపీ
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసును రీ-ఇన్వెస్టిగేషన్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఆయన డైరీలోని అంశాల ద్వారా నిజానిజాలను వెలికితీసే అవకాశం కనిపిస్తున్నది. ఎనిమిదేండ్ల క్రితం (2016లో) జరిగిన ఎన్‌కౌంటర్, దానికి కొనసాగింపుగా జరిగిన దర్యాప్తు వివరాలపై సర్కారు ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ఈ కేసు రీ ఇన్విస్టిగేషన్ ద్వారా స్వాధీనమైన సొమ్ము ఎంత? అప్పటి అధికార పార్టీ నేతలకు ఏమైనా చేరిందా? నయీంతో సంబంధాలున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు? పొలిటీషియన్లతో ఉన్న లింకులేంటి? ఇలాంటి అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నయీమ్ డైరీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. బ్రిటీష్ కాలంలో తెచ్చిన చట్టాల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే పాత చట్టాలను మారుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జ్యూడీషియల్ రిమాండ్‌ను 14 రోజుల కంటే ఎక్కువ పెంచాలని అన్నారు. నల్సార్ వర్సిటీ వీసీ సూచించిన చట్టాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ కేసులోనూ ఇంతవరకు పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు.



Next Story