T-Congress: అధికార కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం.. ఢిల్లీలో నిరసనకు దిగిన స్టేట్ ఉమెన్ లీడర్స్..!

by Satheesh |
T-Congress: అధికార కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం.. ఢిల్లీలో నిరసనకు దిగిన స్టేట్ ఉమెన్ లీడర్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నామినేటేడ్ పదవుల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు ఢిల్లీలో నిరసనకు దిగారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో అధిష్టానాన్ని కలిసిన పలువురు మహిళా నేతలు.. పార్టీ పెద్దల వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ అధికారంలో లేకున్నా పదేళ్ల పాటు పార్టీ బలోపేతం కోసం పని చేశామని.. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ పవర్‌లోకి వచ్చిన తమకు పదవుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని గోడు వెళ్లబోసుకున్నారని టాక్. ఇదే అంశంపై చర్చించేందుకు సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవాలని మహిళా నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు సునీత రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల నియమించిన 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇతర నామినేటేడ్ పోస్టుల్లో 10 శాతం కూడా మహిళలు లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు సమాన హక్కు ఉండాలన్నది రాహుల్ గాంధీ నినాదమని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. పార్టీ విజయం కోసం పని చేసి.. నామినేటేడ్ పదవుల కేటాయింపుల్లో అన్యాయానికి గురైన మహిళా నేతల జాబితాను అధిష్టాన పెద్దలకు అందజేశామని తెలిపారు. కాగా, అధికార కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఏకంగా ఢిల్లీలో నిరసనకు దిగడం చర్చనీయాంశంగా మారింది.



Next Story