Medigadda Barrage : మేడిగ‌డ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థకు భారీ షాక్‌

by Y. Venkata Narasimha Reddy |
Medigadda Barrage : మేడిగ‌డ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థకు భారీ షాక్‌
X

దిశ, వెబ్ డెస్క్ : మేడిగ‌డ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పని పూర్తయిందని నిర్మాణ సంస్థకు ఇచ్చిన వ‌ర్క్ కంప్లీష‌న్ స‌ర్టిఫికెట్ ను ర‌ద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. దెబ్బతిన్న... మిగిలిన ప‌నుల‌ను నిర్మాణ సంస్థతోనే పూర్తి చేయించాల‌ని నిర్ణయించింది. ఒప్పందానికి భిన్నంగా ప‌నులు చేశార‌ని నిర్మాణ సంస్థ పై క్రిమిన‌ల్ ప్రాసిక్యూష‌న్ చ‌ర్యలు తీసుకోవాలంటూ ఇరిగేష‌న్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్) కార్యదర్శి రాహుల్ బొజ్జా అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న నిర్మాణాలకు మరమ్మతులు చేయకుండా, ఒప్పందం ప్రకారం పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయకుండానే గుత్తేదారుకు పని పూర్తయినట్లు ఇంజనీర్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వడం, ఒప్పందానికి భిన్నంగా పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలని గుత్తేదారు కోరి తీసుకోవడాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తప్పుపట్టింది. ఒప్పందం ప్రకారం క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ కు ఇచ్చినా.. ఇంకా తన వద్దకు చేరకముందే.. పని పూర్తయినట్లు గుత్తేదారుకు ఇచ్చిన సర్టిఫికెట్ ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

విజిలెన్స్ విచారణతో చర్యలు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని 2019 జూన్ 21న కేసీఆర్ ప్రారంభించారు. అదే ఏడాది ఆగస్టు 6న నిర్మాణ సంస్థ ఎల్అండ్-పీఈఎస్ సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు లేఖ రాసింది. పని పూర్తయినట్లు ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరింది. అయితే ఇందుకు అన్ని రకాలుగా సంతృప్తికరంగా పని పూర్తయిందని, తుది పరీక్షల్లోనూ పాస్ అయిందని, నిర్వహణ సమయంలో ఏమైనా సమస్యలు వస్తే పునరుద్ధరిస్తామనీ నిర్మాణ సంస్థ అండర్జేకింగ్ ఇవ్వాలి. ఈ నోటీసు అందిన 21 రోజుల్లో ప్రాజెక్టు ఇంజనీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, నిర్మాణ సంస్థ అండర్ టేకింగ్ ఇవ్వలేదని విజిలెన్స్ నివేదిక పేర్కొంది. అయితే 2020 మే 18న అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమణారెడ్డి నిర్మాణ సంస్థకు నోటీసు ఇచ్చారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయని, వియరింగ్ కోట్ దెబ్బతిందని.. వీలైనంత త్వరగా బాగు చేయాలని కోరారు. దీనికి నిర్మాణ సంస్థ సమాధానమిస్తూ 2019 నవంబరు నుంచి బ్యారేజీ దిగువన డ్యామేజెస్ గుర్తిస్తున్నామని, వీటిని సీరియస్ గా తీసుకొని అధ్యయనం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అన్నారం, సుందిళ్లలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

బ్యారేజీ దిగువన డ్యామేజెస్ ఉన్నట్లు గుర్తించామని స్పష్టంగా చెప్పిన నిర్మాణ సంస్థ.. దీనికి భిన్నంగా పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలని 2020 అక్టోబరు 12న మరోసారి లేఖ రాసింది.

2019 జూన్ నుంచి మేడిగడ్డ పూర్తిగా నిర్వహణలో ఉందని, పూర్తిస్థాయి నీటిమట్టంలో 16.2 టీఎంసీలు నిల్వ చేశారని, ఎలాంటి సమస్య లేకుండా 15 నెలలుగా ఆపరేషన్ లో ఉందని పేర్కొంది. అయితే ఆ లేఖ వాస్తవానికి భిన్నంగా ఉందన్న విషయాన్ని ప్రస్తావించకుండానే.. బ్యారేజీ దిగువన జరిగిన డ్యామేజెస్ ను బాగు చేయడంతోపాటు ఒరిజినల్ పనుల్లో ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా పూర్తి చేయాలంటూ నిర్మాణ సంస్థకు 2021 ఫిబ్రవరి 17న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లేఖ రాశారు. దీనిపై నిర్మాణ సంస్థ స్పందించలేదని, పునరుద్ధరణ పనులు చేయలేదని విజిలెన్స్ నివేదిక పేర్కొంది. మళ్ళీ 2021 మార్చి 10న పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్మాణ సంస్థ కోరగా.. ఆండర్ టేకింగ్ తీసుకోకుండానే 2021 మార్చి 15న సర్టిఫికెట్ ఇచ్చేశారు. పని పూర్తయినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతిరావు ఫైనల్ సర్టిఫికెట్ ఇవ్వగా, ఆ సమయంలో ఎస్ఈగా ఉన్న రమణారెడ్డి కౌంటర్ సంతకం చేశారు.

బ్యారేజీ దిగువన దెబ్బతిన్న పనులు పూర్తి చేస్తామని అండర్టేకింగ్ తీసుకోకుండానే పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చినందువల్ల ప్రభుత్వ ప్రయోజనాలు దెబ్బతినడంతోపాటు ఖజానాకు నష్టం వాటిల్లిందని, ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేర్కొంది. బ్యారేజీ ఇంజినీర్లు మాత్రం సర్టిఫికెట్ రద్దుకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేదని తెలిసింది. సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లే ఇప్పటికీ అక్కడ ఆ స్థానాల్లో ఉండటం గమనార్హం. తాజాగా నిర్మాణ సంస్థకు ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాతపూర్వకంగా ఆదేశించడం.. శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed