Telangana Secretariat : సెక్రటేరియట్ నిర్మాణంలో సీక్రెట్‌గా రూ.500 కోట్లు!

by karthikeya |   ( Updated:2024-10-11 02:59:23.0  )
Telangana Secretariat : సెక్రటేరియట్ నిర్మాణంలో సీక్రెట్‌గా రూ.500 కోట్లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ సెక్రెటేరియేట్ నిర్మాణ ఖర్చు పెరగడంపై ఒక వైపు విచారణ జరగడం.. మరోవైపు అనుమానాలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దాన్ని నిర్మించిన కాంట్రాక్టర్‌కు రూ.500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ అంశంలో సదరు కాంట్రాక్టు సంస్థ పలుమార్లు ప్రయత్నం చేసినా ఫలితంలేదని సమాచారం.

విజిలెన్స్ విచారణ ఒకవైపు..

కేసీఆర్ సర్కారు తెలంగాణ రాష్ట్ర సచివాలయ నిర్మాణ ఖర్చు రూ.617 కోట్లని అంచనా వేసి మొదలుపెట్టింది. నిర్మాణం పూర్తి అయ్యేనాటికి దాన్ని అమాంతంగా పెంచేసింది. రూ.617 కోట్ల నుంచి రూ.1,140 కోట్ల వరకు అంచనాలు పెంచి ఖర్చు చేసినట్టు ప్రస్తావించింది. సెక్రెటేరియట్‌లో ఐటీ పరికరాల కొనుగోళ్ల కోసం తొలుత రూ.181 కోట్ల అంచనా వేసి దాన్ని రూ.361 కోట్లకు పెంచినట్టు పేర్కొంది. సచివాలయం నిర్మాణం కోసం అంచనాల కంటే రూ.523 కోట్లు, ఐటీ పరికరాల కొనుగోలుకు అంచనాల కంటే రూ.180 కోట్లు అధిక ఖర్చు చేసిందని ప్రస్తావించింది. ఈ బాగోతంపై విజిలెన్స్ నిగ్గు తేల్చనుంది.

ఆర్కిటెక్టులకు కొంత మేర చెల్లింపులు

సచివాలయ ఆర్కిటెక్టులు ఆస్కార్‌ పొన్ని- జి.కాన్సెస్సో దంపతులకు ఇవ్వాల్సిన కన్సల్టింగ్ చార్జెస్‌ను కూడా ప్రభుత్వం ఆపేసిందని ఆర్ అండ్ బీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వారికి అగ్రిమెంట్ చేసుకున్న దాంట్లో కొంతమేర ఇవ్వగా, మిగతా పెండింగ్ చార్జెస్ మాత్రం ఇంకా చెల్లించలేదని తెలుస్తున్నది. కొంతమేర చెల్లింపులు ఇదివరకే జరగగా, మిగతాది కూడా వచ్చే ప్రభుత్వంలో తాము ఇస్తామని వారికి గత ప్రభుత్వం చెప్పినట్టు తెలిసింది. అయితే, కేసీఆర్ ఊహించని విధంగా ప్రభుత్వం మారడంతో వారికి మిగతా నిధులు చెల్లించే మార్గం లేకపోయింది. ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దలకు ఆస్కార్‌ జి.కాన్సెస్సో పెండింగ్ చార్జీల మీద వినతిపత్రం సమర్పించగా, ప్రస్తుతం ఆ విషయంలో విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అవి ఆగినట్టు ఆర్ అండ్ బీ వర్గాలు వెల్లడించాయి.

కేసీఆర్ సర్కారు హయాంలో నిర్మించిన సెక్రెటేరియట్ నిర్మాణ వ్యయం వివరాలను ఆర్‌ అండ్‌ బీ ఆఫీసర్లు చాలా గోప్యంగా ఉంచారు. ప్రభుత్వ మార్పుతో సచివాలయ నిర్మాణ సంబంధిత విషయాలు, వివరాలు బహిర్గతమైన సంగతి విదితమే. అంచనాల పెంపుపై విజిలెన్స్ విచారణ పూర్తిగా తేలేదాకా ఆర్కిటెక్టులకు మిగతా కన్సల్టింగ్ ఫీజు ఇచ్చే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. ఇదే అంశంపై ఆస్కార్ పొన్నిలను ‘దిశ’ సంప్రదించగా వారు స్పందించేందుకు నిరాకరించారు.

Advertisement

Next Story