ఖబడ్దార్ జగన్.. ఇంతకింతా బదులు తీర్చుకుంటాం

by srinivas |
ఖబడ్దార్ జగన్.. ఇంతకింతా బదులు తీర్చుకుంటాం
X

దిశ, ఏపీబ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ను సీఎం జగన్ ఆఫ్ఘనిస్తాన్‌గా మర్చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు నివాసం దగ్గర వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఖబడ్దార్ జగన్మోహన్ రెడ్డి.. ఇంతకింతా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ రావణకాష్టంగా మార్చేశారని.. ప్రజాస్వామ్యం మంటగలిసిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇంటి ముట్టడికి వైసీపీ గూండాలు ప్రయత్నించడం దారుణమంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనడానికి ఈ ఘటనే నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటు పడిన జగన్ ఏపీని ఆఫ్ఘనిస్తాన్‌గా మార్చేశారంటూ మండిపడ్డారు.

వైసీపీ నేతలు తాలిబన్లను మించిపోయారని.. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ప్రతిపక్షంగా మాట్లాడటం తప్పా అని ప్రకటనలో నిలదీశారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే గూండాగిరి చేస్తారా? జోగి రమేష్ ఎమ్మెల్యేనా లేక గూండానా..? అని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు ఇంటిపై రౌడీ మూకను వేసుకొచ్చి రాళ్ల దాడి చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిని అడ్డుకున్న టీడీపీ నేతలపై రాళ్ల దాడి చేయడం ఈ అరాచక పాలనలోనే చూస్తున్నామని చెప్పుకొచ్చారు. రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. అధికారాన్ని, పోలీసులను గుప్పిట్లో పెట్టుకున్న జగన్ ఇలాంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed