టీమిండియాతో మాకు కఠిన సవాలే : కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్

by saikumar |
టీమిండియాతో మాకు కఠిన సవాలే : కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా జట్టు వరుస సిరీసులతో బిజీగా ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు సిరీస్‌లు, మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.మరో మూడ్రోజుల్లో న్యూజిలాండ్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడనుంది. ఇందుకోసం ఇరుజట్లు తమ స్క్వాడ్‌లను సైతం ప్రకటించాయి. జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా.. స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వైస్‌కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. ఇక సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి ఈ సిరీస్‌కు అవకాశం దక్కలేదు. అతన్ని గాయం మళ్లీ ఇబ్బంది పెట్టడంతో విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.ఈలోపు ఫిట్‌నెస్‌ సాధిస్తే రంజీ ట్రోఫీలో బరిలోకి దిగే చాన్స్ ఉంది. నవంబర్ మూడోవారం నుంచి ఆసీస్‌ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది.

ఈ క్రమంలోనే షమీని ఉద్దేశించి న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టీడ్ స్పందిస్తూ.. ఒక బౌలర్‌ లేనంత మాత్రాన భారత్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. కేవలం ఒకరిద్దరిపైనే ఆధారపడే పరిస్థితి టీమిండియాకు లేదని స్పష్టంచేశాడు.‘ఒకవేళ టాప్‌ బౌలర్‌ ఎవరైనా గాయంతో దూరమైతే భారత్‌కు వచ్చే నష్టమేమీ లేదు. ఇతర జట్ల మాదిరిగా తీవ్ర ప్రభావం ఉండనే ఉండదు. కొత్తగా ఎవరు వచ్చినా పరిస్థితులకు తగ్గట్టు మారిపోతారు. నాణ్యమైన ప్రదర్శన చేస్తారు. అందుకే చాలా మంది క్రికెటర్లు టెస్టుల్లోకి వచ్చారు. భారత్‌ బ్రాండ్‌ క్రికెట్‌తో ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా నిలిచింది. తప్పకుండా మాకు(కివీస్) కఠిన సవాల్‌ తప్పదని భావిస్తున్నాం. అందుకు తగ్గట్గుగానే సిద్ధమవుతున్నాం’ అని స్టీడ్ తెలిపాడు. కాగా, భారత్‌తో టెస్టు సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ కెప్టెన్‌‌గా టామ్ లేథమ్‌ నియామకం అయ్యారు. టిమ్‌ సౌథీ వీడ్కోలు నేపథ్యంలో కివీస్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story