టీమిండియా కొత్త జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్..!

by Vinod kumar |
టీమిండియా కొత్త జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్..!
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లంతా కొత్త జెర్సీలో ఫొటోలు దిగారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియా టూల్ కిట్ స్పాన్సర్‌గా ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ కంపెనీ ఆదిదాస్‌తో బీసీసీఐ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికి లీడ్ స్పాన్సర్ ఎవరూ లేరు. ఇటీవల లీడ్ స్పాన్సర్ కోసం టెండర్లు పిలవగా.. ప్రముఖ ఫాంటసీ క్రికెట్ లీగ్ యాప్ డ్రీమ్11 ఈ అవకాశం దక్కించుకుంది. ఈ క్రమంలో విండీస్‌తో తొలి టెస్టులో తొలిసారి కొత్త జెర్సీతో భారత ఆటగాళ్లు బరిలో దిగనున్నారు.

ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ఫొటో షూట్‌లో టీమిండియా స్టార్లు కొత్త జెర్సీలో మెరిశారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఎర్రని 'డ్రీమ్11' లోగో వల్ల టెస్టు జెర్సీ అందం అంతా పోయిందని అంటున్నారు. మరికొందరైతే అసలు ఇది టెస్టు జెర్సీనేనా? అని నిలదీస్తున్నారు. ఫ్యాన్స్‌కు ఈ జెర్సీ అంత నచ్చలేదని అర్థం అవుతోంది.

టెస్టు మ్యాచులు అంటే పూర్తిగా వైట్ క‌ల‌ర్‌లోనే ఉంటాయి. అయితే కొత్త జెర్సీలు క్రమంగా రంగులమ‌యంగా మారుతూ వ‌న్డే మాదిరిగా త‌యారు అవడంపై ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. దేశం పేరు ఉండాల్సిన స్థానంలో కంపెనీ పేరు డ్రీమ్ 11 ఉండ‌టాన్ని తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు క్రికెట్ మ్యాచులు దేశం కోసం ఆడుతున్నట్లుగా లేద‌ని, డ్రీమ్ 11 కోసమే ఆడుతున్నట్లు ఉంద‌ని నెటీజ‌న్లు ఎద్దేవా చేస్తున్నారు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు జూలై 12న డొమినికా వేదికగా జరగనుంది.

Advertisement

Next Story