సైనా కష్టాన్ని, ప్రతిభను తక్కువ చేసేలా కామెంట్లు.. విమర్శకుల నోళ్లు మూయించిన షట్లర్

by Harish |
సైనా కష్టాన్ని, ప్రతిభను తక్కువ చేసేలా కామెంట్లు.. విమర్శకుల నోళ్లు మూయించిన షట్లర్
X

దిశ, స్పోర్ట్స్ : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, లండన్ ఒలింపిక్స్-2012 బ్రాంజ్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తుంది. తనను ట్రోల్ చేసిన వారికి తాజాగా సైనా గట్టి కౌంటర్ ఇచ్చింది. కనీసం ఒలింపిక్స్‌‌కు అర్హత సాధించి, ఆ తర్వాత తన గురించి మాట్లాడాలని చెప్పి విమర్శకుల నోళ్లు మూయించింది తాజాగా భర్త పారుపల్లి కశ్యప్‌తో కలిసి సైనా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా కశ్యప్ మాట్లాడుతూ..‘పారిస్ ఒలింపిక్స్ సమయంలో సైనా ఏదో మాట్లాడింది. సోషల్ మీడియాలో కొందరు ఆమె కాంస్య పతకాన్ని బహుమతిగా పొందిందని కామెంట్లు పెట్టారు.’ అని చెప్పాడు. దీనిపై సైనా స్పందిస్తూ.. అలాంటివారు కనీసం ఒలింపిక్స్ స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించాలని గట్టి సమాధానమిచ్చింది.

కాగా, ఇటీవల సైనా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై, భారత క్రికెట్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగట్‌ అనర్హత వేటు ఎదుర్కోవడంలో ఆమె తప్పు కూడా ఉందని వ్యాఖ్యానించి విమర్శలు ఎదుర్కొంది. అలాగే, దేశంలో ఇతర క్రీడల కంటే క్రికెట్‌కే ఎక్కువ ఆదరణ ఇవ్వడం బాధగా ఉంటుందన్న ఆమె.. ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ తాను కొట్టే స్మాష్‌లను బుమ్రా అడ్డుకోలేడని కామెంట్ చేసి క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది.

సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్స్ చేశారు. పలువురు సైనా కష్టాన్ని, ప్రతిభను తక్కువ చేస్తూ పోస్టులు పెట్టారు. ఒలింపిక్స్‌లో ఆమెకు అదృష్టవశాత్తూ, బహుమతిగా పతకం దక్కిందని కామెంట్లు చేయగా తాజాగా సైనా కౌంటర్ ఇచ్చింది. లండన్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి రెండో గేమ్‌లో గాయం కారణంగా వైదొలగడంతో సైనాకు కాంస్య పతకం దక్కింది. బ్యాడ్మింటన్‌లో దేశానికి తొలి మెడల్ అందించిన షట్లర్‌గా సైనా చరిత్ర సృష్టించింది.

Advertisement

Next Story

Most Viewed