7 వికెట్లతో చెలరేగిన త్యాగరాజన్.. సెమీస్‌లో గెలుపు దిశగా హైదరాబాద్

by Harish |
7 వికెట్లతో చెలరేగిన త్యాగరాజన్.. సెమీస్‌లో గెలుపు దిశగా హైదరాబాద్
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో ప్లేట్ గ్రూపులో నాగాలాండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో హైదరాబాద్ జట్టు గెలుపు దిశగా వెళ్తున్నది. శనివారం స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్(7/63)బంతితో మాయ చేసి నాగాలాండ్‌ను స్వల్ప స్కోరుకే కూల్చేయడంతో మ్యాచ్‌‌పై జట్టు పూర్తి పట్టు సాధించింది. ముందుగా ఓవర్‌నైట్ స్కోరు 383/5‌తో రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ 462/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ ఇచ్చింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన నాగాలాండ్ బ్యాటర్లు హైదరాబాద్ బౌలర్ల ధాటికి తడబడ్డారు. ముఖ్యంగా స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 7 వికెట్ల ప్రదర్శనతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. దీంతో నాగాలాండ్ 206 పరుగులకే ఆలౌటైంది. జాషువా ఒజుకుమ్(50) హాఫ్ సెంచరీ చేయగా.. జగన్నాథ్ శ్రీనివాస్(44), జోనాథన్(41) పర్వాలేదనిపించడంతో నాగాలాండ్ ఆ స్కోరైనా చేయగలిగింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌కు 256 పరుగుల ఆధిక్యం దక్కింది. దీంతో హైదరాబాద్ జట్టు నాగాలాండ్‌ను ఫాలో ఆన్ ఆడించింది. చివరి సెషన్ ఆఖర్లో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన నాగాలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. యుగంధర్ సింగ్(18), సెడెజాలీ రూపెరో(2) క్రీజులో ఉన్నారు. ఇంకా ఆ జట్టు 236 పరుగులు వెనకబడి ఉండగా.. మూడోరోజు బౌలర్లు చెలరేగితే హైదరాబాద్‌కు ఇన్నింగ్స్ విజయం దక్కనుంది.

Next Story

Most Viewed