థాయిలాండ్ ఓపెన్ నుంచి సింధు విత్‌డ్రా

by Dishanational3 |
థాయిలాండ్ ఓపెన్ నుంచి సింధు విత్‌డ్రా
X

దిశ, స్పోర్ట్స్ : ఈ నెల 14 నుంచి థాయిలాండ్‌లో జరిగే థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి పీవీ సింధు తప్పుకుంది. ఇటీవల ఆమె ఉబెర్ కప్‌కు కూడా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ కూడా ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధత నేపథ్యంలో వీరు ఈ టోర్నీ నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది. బుధవారం థాయిలాండ్ ఓపెన్ డ్రా విడుదలైంది.

భారత జట్టుకు స్టార్ డబుల్స్ జంట సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ జోడీ నాయకత్వం వహించనుంది. తొలి రౌండ్‌లో నూర్ అహ్మద్ అజ్రిన్ అయుబ్-టా వీ కియోంగ్‌(మలేషియా) జంటతో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో ఆడనున్నాడు. కిరణ్ జార్జ్, సతీశ్ కుమార్‌ కూడా పోటీలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బాన్సోద్, అష్మిత, ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడా బరిలో ఉన్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-సిక్కీ రెడ్డి, సతీశ్ కుమార్-ఆద్య జోడీలు పాల్గొంటాయి. సింగిల్స్‌లో పీవీ సింధు, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్, పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ, మహిళల డబుల్స్‌లో తనీషా-అశ్విని జంట పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Next Story