న్యూజిలాండ్ పర్యటనలో పరువు కాపాడుకున్న పాకిస్తాన్

by Harish |
న్యూజిలాండ్ పర్యటనలో పరువు కాపాడుకున్న పాకిస్తాన్
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌ పర్యటనలో ఆఖరి టీ20లో నెగ్గి పాకిస్తాన్ పరువు కాపాడుకుంది. ఆతిథ్య కివీస్ వరుసగా నాలుగు మ్యాచ్‌లు నెగ్గి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 42 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలుపొందింది. దీంతో సిరీస్ క్లీన్‌స్వీప్ గండం నుంచి పాక్ బయటపడింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 134 పరుగులు చేసింది. రిజ్వాన్(38), ఫకర్ జమాన్(33) కీలక పరుగులు జోడించారు. సౌథీ, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్, ఇష్ సోధి రెండేసి వికెట్లతో రాణించడంతో పాక్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అయితే, స్వల్ప లక్ష్యాన్ని పాక్ బౌలర్లు కాపాడుకున్నారు. 135 పరుగులతో ఛేదనకు దిగిన కివీస్‌ను 17.2 ఓవర్లలోనే 92 పరుగులకే ఆలౌట్ చేశారు. కివీస్ బ్యాటర్లలో ఏ ఒక్కరూ క్రీజులో నిలువలేకపోయారు. గ్లెన్ ఫిలిప్స్(26), ఫిన్ అలెన్(22), టిమ్ సీఫెర్ట్(19), విల్ యంగ్(12) మాత్రమే రెండెంకల స్కోరు చేయగా.. మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పాక్ బౌలర్లలో ఇఫ్తికర్ అహ్మద్ 3 వికెట్లతో సత్తాచాటగా.. కెప్టెన్ షాహీన్ అఫ్రిది, మహ్మద్ నవాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను న్యూజిలాండ్ 4-1తో దక్కించుకుంది.

Next Story

Most Viewed