వింబుల్డన్‌కు కొత్త రాణి.. చాంపియన్‌గా క్రెజికోవా

by Harish |
వింబుల్డన్‌కు కొత్త రాణి.. చాంపియన్‌గా క్రెజికోవా
X

దిశ, స్పోర్ట్స్ : వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌కు కొత్త రాణి వచ్చింది. చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా ఉమెన్స్ సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. శనివారం రసవత్తరంగా సాగిన ఫైనల్‌లో క్రెజికోవా 6-2, 2-6, 6-4 తేడాతో ఇటలీ క్రీడాకారిణి పావోలినిపై విజయం సాధించింది. గంటా 56 నిమిషాలపాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. మొదట తొలి సెట్‌ను నెగ్గి క్రెజికోవానే శుభారంభం చేసింది. అయితే, రెండో సెట్‌లో ఆమెకు పావోలిని షాకిచ్చింది. దూకుడుగా ఆడి ఆ సెట్‌ను దక్కించుకుని స్కోర్‌ను 1-1తో సమం చేసింది.

ఇక, నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఇద్దరు నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డారు. ఒక దశలో ఇద్దరు 3-3తో సమంగా నిలిచారు. ఆ తర్వాత క్రెజికోవా దూకుడు పెంచి ప్రత్యర్థిని నిలువరించింది. నాలుగు గేముల్లో మూడు నెగ్గి మూడో సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. దీంతో తొలిసారిగా ఫైనల్‌లో అడుగుపెట్టిన పావోలినికి నిరాశ తప్పలేదు. మహిళల డబుల్స్‌లో ఇప్పటికే రెండుసార్లు విజేతగా నిలిచిన క్రెజికోవా సింగిల్స్‌లో టైటిల్ గెలవడం ఇదే తొలిసారి.

Advertisement

Next Story

Most Viewed