ఫైనల్‌కు సాత్విక్ జోడీ

by Harish |
ఫైనల్‌కు సాత్విక్ జోడీ
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియా ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్‌లో సాత్విక్ జోడీ 21-18, 21-14 తేడాతో 4వ సీడ్, మలేషియాకు చెందిన సోహ్ వూయ్ యిక్-ఆరోన్ చియా జోడీపై విజయం సాధించింది. ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్, చిరాగ్ పోరాడి గెలిచారు. నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి గేమ్‌లో 17-17తో సమవుజ్జీలుగా నిలిచిన సమయంలో సాత్విక్ జోడీ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి లీడ్‌లోకి వెళ్లడంతోపాటు తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌ కూడా అదే తరహాలో సాగింది. ఒక దశలో భారత జంట 10-13తో వెనుకబడింది. అయితే, ఆ తర్వాత పుంజుకుని వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. నేడు ఫైనల్‌లో కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్-సియో సీయింగ్ జే జోడీతో సాత్విక్ జోడీ తలపడనుంది. మరోవైపు, మెన్స్ సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. సెమీస్‌లో వరల్డ్ నం.2, చైనా ఆటగాడు షి యు క్వి చేతిలో 21-15, 21-5 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.

Advertisement

Next Story

Most Viewed