Paris olympics : బంగారు పతకం కోసం 200 శాతం కష్టపడతా : సింధు

by Harish |
Paris olympics : బంగారు పతకం కోసం 200 శాతం కష్టపడతా : సింధు
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దీమా వ్యక్తం చేసింది. రియో ఒలింపిక్స్‌-2016 లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌-2020లో కాంస్యం నెగ్గిన ఆమె.. పారిస్ విశ్వక్రీడల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. తాజాగా ఓ షోలో సింధు మాట్లాడుతూ..‘పారిస్‌లో మూడో పతకం నన్ను కచ్చితంగా ప్రేరేపిస్తుంది. గోల్డ్ మెడల్ కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తా. ఒలింపిక్స్‌ అంటే 200 శాతం కష్టం పెడతా.’ అని చెప్పింది. ఒలింపిక్స్‌లో తనకు చాలా అనుభవం ఉందని, అయితే, పతకాల విషయంలో తనకు మితిమీరిన ఆత్మవిశ్వాసం లేదని తెలిపింది. ‘మూడో పతకాన్ని గెలుస్తానని ఆశిస్తున్నా. వరుసగా మూడు పతకాలు గెలవడం జోక్ కాదు. నేను స్వర్ణం సాధించడంపైనే ఫోకస్ పెట్టా. ఇది నాకు ప్రేరణ, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.’ అని చెప్పింది.

అలాగే, ఒలింపిక్స్‌లో పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుందని సింధు అంగీకరించింది. ‘ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు అత్యుత్తమ స్థాయిలో ఉన్నారు. యాన్ సె యంగ్, యమగూచి, కరోలినా మారిన్, తై జు యింగ్‌తోపాటు టాప్ 10-15 ప్లేయర్లు ఒకే రకమైన స్థాయిని కలిగి ఉంటారు. కాబట్టి, ఒలింపిక్స్‌లో చాలా పోటీ ఉంటుంది. పాయింట్లు సులువుగా రావు. ప్రత్యర్థిపై మనం సాధించే ఒక్క పాయింట్ కోసం తీవ్రంగా కష్టపడాలి. ఒలింపిక్స్‌లో ఏదైనా జరగొచ్చు. ఒక్క చిన్న తప్పిదం మొత్తం ఆటనే మార్చే్స్తుంది. ప్రకాశ్ సర్ నాకు మెంటార్‌గా ఉండటం, నా జర్నీలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన మద్దతుతో పతకం గెలుస్తానని ఆశిస్తున్నా.’ అని సింధు చెప్పుకొచ్చింది. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో గ్రూపు దశలో సింధుకు సులువైన డ్రా దక్కింది. గ్రూపులో తక్కువ ర్యాంకర్లతో పోటీపడుతుండటంతో ఆమె నాకౌట్ చేరుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed